Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పెద్దారపు రమేష్
నవతెలంగాణ-నర్సంపేట
దోపిడీ వర్గాల ఆధిపత్యంలో బహుజనులు బలైతున్నారని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పెద్దారపు రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని జ్యోతిబస్సు నగర్లో కుక్కల యాకయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో రమేష్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, సంజార జాతులు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అణిచివేతకు గురవుతూ వచ్చారన్నారు. సామాజిక కులాలను ఓటు బ్యాంకుగానే చూశాయే తప్ప వారి బాగోగులను పట్టించు కున్న దాఖాలాలు లేవన్నారు. ఆత్మగౌరవం లేని పరిస్థితి నెలకొన్నందని ఆందోళన వ్యక్తం చేశారు. బహుజన తెలంగాణ సాధించు కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిపోగా టీఆర్ఎస్ పాలనలో మరింత దారుణంగా తయారిందన్నారు. అవినీతి, నియంతృత్వం, దోపిడి విపరీతంగా పెరిగిందన్నారు. శ్రమ జీవులకు కనీస గుర్తింపులేకపోవడం శోచనీయ మన్నారు. 93శాతం ఉన్న బహుజనుల కనీస అవసరాలు తీర్చకుండా కేసీఆర్ గొర్రెలు, బర్రెలు, పందులు, చేపల వృత్తిపై ఆధారపడాలని అవహేళన చేస్తున్నారని, పాలకుల తీరును ఎండగట్టాలని సూచించారు. ఈ క్రమంలో బహుజనులకు రాజ్యాధికారం దక్కితే తప్ప బతుకులు మారవని, బీఎల్ఎఫ్ను ముందస్తు ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. బీఎల్ఎఫ్ తప్ప టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కూటములన్నీ బహుజనులకు వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. నర్సంపేట బీఎల్పీ అభ్యర్థి మద్దికాయల అశోక్ రైతు నాగలి గుర్తుకు ప్రజలు ఓటేసి బహుజన రాజ్యం స్థాపించకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీఎల్ఎఫ్ పట్టణాధ్యక్షులు వంగల రాగసుధా, సీపీఐ(ఎం) పట్టణ నాయకులు మోటం సురేష్, బండారి మల్లేషం, పుట్టపాక సాంబయ్య, గడ్డం స్వరూప, పుట్టపాక సునిత, ఈర్ల రాజు, పీ.యాకయ్య, పుష్ఫ, ప్రమీల, నిర్మల, సర్వర్బీ జన్ను నీల, ఖాజాపాషా, అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.