Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి సీతక్క అన్నారు. శనివారం మండలంలోని రాఘవపట్నం, కొత్త నాగారం, ఇప్పలగడ్డ, టప్పామంచా, ప్రాజెక్టునగర్, ముత్తాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ నాలుగేండ్లలో ములుగు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మాజీమంత్రి చందూలాల్ తనస్వార్థం కోసం ములుగు జిల్లాను తాకట్టుపెట్టారని, గోదావరి జలాలను నియోజకవర్గానికి మళ్లించడంలో దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు.50 ఏండ్లకుపైగా సాగు చేసుకుంటున్న రైతుల నుంచి వంద ఎకరాలకు పైగా సాగుభూములను లాక్కొని చరిత్రలో నిలిచి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.తిరిగి గెలిపిస్తే లక్నవరానికి గోదావరి జలాలు మళ్లిస్తామని మాయమాటలు చెబుతున్న వారికి తగినగుణపాఠం చెప్పాలన్నారు. బొగ్గు, ఎర్ర మట్టి, ఇసుకను ఇష్టారాజ్యాంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్న నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు. గిరిజనులు, గిరిజనేతర పోడు భూములను లాక్కోని హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ, ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ములుగును జిల్లాగా ప్రకటిస్తామని, పొలాలు, పోడుభూములకు హక్కు పత్రాలు, పట్టాలు ఇప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రసపుత్ సీతారాంనాయక్, కొంపెల్లి శ్రీనివాస్రెడ్డి, కర్ర సాంబశివుడు, ఎల్లారెడ్డి, సుదర్శన్రెడ్డి, కట్ల జనార్థన్రెడ్డి, పాలడుగు వెంకటక్రిష్ణ, శివరాజు, సు కొండల్, శరత్, సంగి సందీప్, పెండెం శ్రీకాంత్, జగదీష్, చింత క్రాంతి, సురేష్, వాసం శ్రావణ్, సామ్రాజ్యం, బాలరాజు, చింటు పాల్గొన్నారు.