Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి అంతం కోసం బీఎల్ఎఫ్ను గెలిపించాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ-గోవిందరావుపేట
అకారణంగా ముందస్తు ఎన్నికలకు నిర్ణయించిన టీఆర్ఎస్ పార్టీ పతనం ఖాయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తెలిపారు. కేసీఆర్ ఊహిస్తున్నట్లు వంద సీట్లు రాకపోగా ఆ పార్టీని ప్రజలు బొందపెడతారని స్పష్టం చేశారు. అవినీతి అంతం కోసం బీఎల్ఎఫ్ బలపర్చిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని సుదర్శన్ పిలుపునిచ్చారు. మండలంలోని
పస్రా గ్రామంలో జిల్లా కమిటీ సభ్యులు పులుగుజ్జు వెంకన్న అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి సదస్సుకు సుదర్శన్ హాజరై మాట్లాడారు. ప్రజాసమస్యలు పరిష్కరించడంలోనే కాకుండా గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని, అవినీతి అంతం చేస్తామని, తదితర అనేక హామీలు గుప్పించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవేమీ చేయకుండా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేలా తప్పుడు విధానాలు అవలంభించిందని విమర్శించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దేశ ప్రజలు అల్లాడిపోతుంటే ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ పార్టీ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే కర్నాటకలో వెలువడిన ఎన్నికల ఫలితాలు కేంద్ర పాలనకు అద్దం పడుతున్నాయని చెప్పారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ అహంకారపూరిత పాలన సాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రజలకు పట్టిన టీఆర్ఎస్ పీడ విరగడ కానుందన్నారు. ఈ విషయమై విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అకారణంగా సీఎం కేసీఆర్ ప్రజలపై ఎన్నికల భారం మోపారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ముందు జమిలి ఎన్నికలకు రాష్ట్రం అనుకూలమే అని చెప్పి, తిరిగి వచ్చిన వెంటనే మాట మార్చి ముందస్తు తీసుకురావడం దుర్మార్గమన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించాకే ఓట్లడుతామన్న కేసీఆర్ ఎన్నికలకు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏటా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఊదరగొట్టిన సీఎం ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా కులాల వారీగా వృత్తిదారులకు బర్రెలు, గొర్రెలు, చేపలు ఇస్తూ వెనకబడిన వర్గాలను అణగదొక్కేందుకు వ్యూహం రచించి అమలు చేస్తున్నారి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో నలుగురికి ప్రతినెలా రూ.22 లక్షలకుపైగా ప్రజాధనాన్ని వృథా చేస్తూ ఖరీదైన భవనం, కార్లు, విమానాల్లో ప్రయాణిస్తూ జల్సా చేస్తున్నారని చెప్పారు. పోడు భూములకు రక్షణ కరువైందని తెలిపారు. పోడు భూమికి కోసం పోరాడే వారిని దారుణంగా హింసించిన చరిత్ర ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. రైతుబంధు పేరుతో బడా భూస్వాములకు సహకరిస్తూ సీఎం కేసీఆర్ రాబందులా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బరిలో నిల్చిన బీఎల్ఎఫ్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దావుద్, అమ్జద్పాషా, జైహింద్రెడ్డి, పొదిల్ల చిట్టిబాబు, రత్నం రాజేందర్, తవిటి నారాయణ, బీరెడ్డి సాంబశివ, తీగల ఆదిరెడ్డి, అంబాల పోశాలు, ముత్యాలు, కుమారస్వామి, చిడం లక్ష్మినారాయణ, గుండు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.