Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
గ్రామాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని సర్పంచ్ సనప సమ్మయ్య అన్నారు. మండలంలోని మొట్లగూడెం సర్పంచ్గా సమ్మయ్య ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా ఆయన నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందు ఉంటూ సంక్షేమ పథకాలు అందరికి సమానంగా అందేలా కృషి చేస్తానన్నారు. ప్రధానంగా మొట్లగూడెం పంచాయతీ పరిధిలోని ప్రాజెక్టునగర్, టప్పామంచా, మొట్లగూడెం గ్రామాల్లో రైతులకు రైతు బంధు పథకం ఏ మాత్రం వర్తించ లేదన్నారు. సొసైటీ భూములు అంటూ పెండింగ్లో పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ప్రకంటిన విధానం ప్రకారం రైతులందరికి రైతు బంధు వర్తించేలా అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మొట్లగూడెం గ్రామానికి వెళ్లడానికి దయ్యాల వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారని తెలిపారు. ఈ వంతెన పునర్నిర్మాణానికి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రధానంగా ఈ గ్రామాల్లో తాగు నీటి సమస్య తీవ్రంగా నెలకొందని, ప్రభుత్వం గతంలో నిర్మించిన వాటర్ ట్యాంకులు వినియోగంలో లేక పోవడం, మిషన్ భగీరథ పూర్తి కాక పోవడం వలన ప్రజలు వాగులోని ఊట నీటినే తాగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతామన్నారు. డబుల్ బెడ్ రూం ఇప్పటి వరకు ఏ ఒక్కరికి మంజూరు కాలేదన్నారు. అర్హులైన పేదలకు ఇండ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీ సమస్య, గ్రామానికి శ్మశానవాటిక ఏర్పాటు తదితర ప్రధాన సమస్యల పరిష్కారానికి గ్రామస్తుల సహకారంతో కృషి చేస్తానన్నారు. అర్హులైన వారికి ఆసరా పింఛన్లు అందించడంతో పాటు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామా అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.