Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ మల్హర్రావు
గ్రామంలో పలుకుబడి ఉండాలనే కోరిక. పైగా రాజకీ యాల్లో చురుగ్గా తిరుగుతుంటారు. పెద్దనేతల అండదండలు ఉండనే ఉన్నాయి. అనేకమంది పంచాయతీ పోరులో సర్పంచ్ అవ్వటమే తరువాయి అనుకోని మండలంలోని 15 గ్రాపంచాయతీల్లో పలువురు చోటామోటా నేతలు కలల కన్నారు. కాని వారికి రిజర్వేషన్ కలిసిరాకపోవడంతో మొదట డిలా పడ్డారు. ఆ తరువాత వెంటనే తేరుకోని భార్య, తల్లి, కుటుంబ సభ్యుల్లో ఒక్కరిని పోటీకి నిలిపారు. అంతటితో ఆగలేదు. ఎలాగైన చక్రం తిప్పాలని భావించారు. వీరికి తోడుగా పంచాయతీరాజ్ చట్టంలో జరిగిన మార్పును అవకాశంగా ఉపసర్పంచ్కు కూడ చెక్పవర్ అవడంతో వారంతా గ్రామాల్లో వార్డు సభ్యులుగా బరిలోకి దిగారు. పెత్తనం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. మండల వ్యాప్తంగా 128వార్డులు ఉండగా 289మంది బరిలో నిలిచారు. సర్పంచ్లకు ధీటుగా ఉపసర్పంచ్ పదవి దక్కించుకోవడానికి సర్వప్రయత్నాలు చేస్తు గెలుపు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఓటర్లకు మద్యం, డబ్బుల ఎర చూపుతున్నారు. మండలంలో ఈ నెల 25న రెండో విడుత ఎన్నికలు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నాం 1గంట వరకు జరుగనున్నాయి.
శాసనసభ ఎన్నికల్లో
శాసనసభ ఎన్నికల్లో ఆయా పార్టీల్లో నేతలకు మద్దతుగా తమ గ్రామాల్లో ప్రచారం చేసిన మండలంలోని 15 గ్రామపంచాయతీలకు సంబంధించిన పలువురు చోటామోటా నేతలు ఆ వెంటనే పంచాయతీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. తమకు పదవి యోగం ఉంటుందని అన్ని విధాల సిద్ధమయ్యారు. కాని ప్రథమ పౌరుడి విష యంలో రిజర్వేషన్ అడ్డు వచ్చింది. వారు ఆశించినచోట రిజర్వేషన్ తారు మారు కావడం, మహిళలకు కేటాయిం చడంతో ఉపసర్పంచ్గా మారి గ్రామంలో తమ పలుకుబడిని కొనసాగిం చాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేయడం ఉపసర్పంచ్ గిరికోసం సర్వ ప్రయత్నాలు చేయడం గమనార్హం.
పెరిగిన ప్రధాన్యం
వార్డు సభ్యులుగా గెలిసిన వారిలో నుంచి ఒకరిని ఉపసర్పంచ్గా ఆదే రోజు చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకోనున్న విషయం తెలిసిందే. పంచాయతీ నిధుల వినియోగంలో చెక్పవర్ ఇంతకాలం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి మాత్రమే ఉండేది. దీంతో ఉపసర్పంచ్ పదవి నామమాత్రమే అన్నట్టుగా తయారైయింది. నిధుల లెక్కలు అడిగినవారికి చెప్పేవారు ఉండని పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి మారనుంది. వీరికి చెక్పవర్ ఉండేలా పంచాయతీరాజ్ చట్టంలో మార్పు చేశారు. ఈ అంశం సర్పంచ్ పదవి రిజర్వేషన్ కలిపి రాని కొంతమందికి ఆశలు చిగురించేలా చేసింది. ప్రాధాన్యం ఉండే పదవి దక్కనుందని భావిస్తున్నారు.
మహిళా రిజర్వుడు చోట
ముఖ్యంగా మహిళకు కేటాయించిన పంచాయతీల్లో వార్డు సభ్యులుగా అత్యధికులు బరిలో దిగుతున్నారు. మరికొన్నిచోట్ల వార్డులను ముందస్తుగానే ఏకగ్రీవం చేసుకుని ఉపసర్పంచ్ పదవిని కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుతున్నారు. కుదిరితే ఏకగ్రీవం, లేకుంటే ఇబ్బడి ముబ్బడిగా వార్డులో పోటికి దిగి ఉపసర్పంచ్ పదవిని దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది.
సర్దుబాట్లకు అవకాశం
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మేల్యే అభ్యర్దులకు మద్దతుగా ప్రచారం చేసిన వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సై అంటూ నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే పార్టీ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. వీరికి సర్దిచెప్పేందుకు ఆయా పార్టీ మండలస్థాయి నేతలు రంగంలోకి దిగి సర్వ ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోవడంతో ఈ విషయాన్ని మంథని ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకపో వడంతో అలాంటి విషయాలు మీ మండలంలోనే మీరే చూసుకోవాలని చెప్పడంతో ఈ సమస్య తలెత్తినట్టుగా తెలుస్తోంది.