Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీగా అవకాశం ఇస్తే సేవలు అందిస్తా
- టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు బీ సునీత
నవతెలంగాణ-గార్ల
అధికార దాహంతో ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్న టీఆర్ఎస్ను పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని జిల్లా టీడీపీ మహిళ అధ్యక్షురాలు, మానుకోట పార్లమెంట్ ఇన్చార్జి బీ సునీత మంగిలాల్ అన్నారు. మండల కేంద్రంలోని టీడీపీ భవనంలో జిల్లా అధ్యక్షుడు కొండపల్లి రాంచంద్రరావుతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలను, మహిళా హక్కులను కాపాడేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, నేడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కనీసం క్యాబినెట్లో మహిళలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఇల్లందు నియోజక వర్గంలో టీడీపీ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే హరిప్రియ నాడు కేసీఆర్ పాలన నీచంగా ఉందన్నారని, నేడు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీ మారాను అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన టీడీపీని వదిలి సమైఖ్యవాద పార్టీ వైసీపీకి మద్దతు ఇవ్వడం కేసీఆర్ కుటిల రాజకీయానికి నిదర్శనమన్నారు. ఆస్తులు కాపాడుకోవాటానికే మాజీ ఎంపీ నామా నాగేశ్వరావు టీడీపీని వీడారని, డబ్బు రాజకీయాలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డోర్నకల్ మండల నాయకులు వెంకటేష్, మండల అధ్యక్షుడు వై కృష్ణరెడ్డి, నాయకులు కోండల్రావు, లింగయ్య, పీ సూజ్ఞన్ప్రసాద్, బీ రాంజీ, రమేష్ పాల్గొన్నారు.