Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుపయోగంగా ఉన్న నీటి తొట్టీలు
- సక్రమంగా లేని పైపులైన్
- పశువులకు తప్పని ఇబ్బందులు
నవతెలంగాణ-బచ్చన్నపేట
ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. 24 గంటల కరెంటుతో బోర్లు వట్టిపోతున్నాయంటూ రైతులు రోదన ఒకవైపు. శిథిలావస్థలో ఉన్న నీటి తొట్టిలతో మూగజీవాల దాహం తీరేదెలా అని మారోవైపు పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. మూగ జీవాల దాహం తీర్చడానికి నీటి తొట్టిలు పనికి రాకుండా పోతున్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకోగా మరికొన్ని నిరుపయోగంగా ఉన్నాయి. దీంతోపాటు నీటి తొట్టీలకు పైప్లైన్ లేకపోవటంతో నీళ్లు నింపడం గగనంగా మారింది. పశువుల తొట్లలో నీళ్ళు లేకపోవడంతో మూగ జీవాల రోదన వర్ణనాతీతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బచ్చన్నపేట మండలంలో 17 పశువుల నీటి తొట్టీలు నిర్మించింది. ుండలంలో రెండు ుూడు తొట్టిల్లో మాత్రమే నీళ్ళు నింపుతున్నారు. మిగితా తొట్టిల్లో కొన్ని నిరుపయోగంగా వున్నాయి. మరికొన్ని శిథిలావస్ధలో ఉన్నాయి. వీటికి నీటి సౌకర్యం కల్పించకపోవడంతో చాలా చోట్ల వాడుకలో లేవు. చుట్టు పక్కల గ్రామాల్లోను మండల కేంద్రంలోను నిర్మించిన తొట్టీల్లో నేటికి నీళ్లు నింపకపోవటంతో బీటలుబారి పనికి రాకుండా పోయాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిరుపయోగంగా ఉన్న నీటి తొట్టిలలో నీళ్లు నింపి మూగ జీవాల దాహాన్ని తీర్చాలని మండల ప్రజలు, రైతులు కోరుతున్నారు.
పైపులైన్ లేకపోవడంతో...
పశువుల దాహం తీర్చడానకి నిర్మించిన నీళ్ల ట్యాంకులకు, తొట్లకు పైపులైన్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తొట్లు నాసిరకంగా నిర్మించడంతో పగుళ్లు ఏర్పడి చాలా చోట్ల నీళ్లు లీకవుతన్నాయి. వీటిపై అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తొట్లలో నీరు నిల్వ ఉండే విధంగా చూడాలి. అలాగే ఇంకా ఎక్కడైనా అవసరం ఉందోనని పరిశీలించి ఆయా గ్రామాల సర్పంచులతో మాట్లాడి తొట్లకు నీళ్లు చేరే విధంగా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.