Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదాయానికి గండి..!
- అంగడీ వేలం రూ.41.05 లక్షలు
- రూ.11.56 లక్షలు అంచనా నష్టం
- రూ.60వేలు మాత్రమే అదనం
నవతెలంగాణ-నర్సంపేట
నర్సంపేట మున్సిపల్ అంగడీపై రావాల్సిన ఆదాయం ఏటా తగ్గుముఖం పడుతుంది. కాంట్రాక్టర్ల సిండికేట్తో అంగడి అంచనా ఆదాయం గాడి తప్పుతుంది. పలుమార్లు అంగడీ వేలం పాటలు వాయిదా వెనుక మతలబు దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిందటి ఏడాది మాదిరిగానే 2019-20 అంగడి వేలం పాటలు మూడో దఫా (సీల్డ్ కవర్) టెండర్తో కాంట్రాక్టర్లు కైవసం చేసుకున్నారు. అంచనా లీజు విలువ కన్నా వేలం పాటలు తక్కువగా పడిపోవడానికి కాంట్రాక్టర్లు, పలువురు ప్రజాప్రతి నిధులు కుమ్ముక్కే కారణమని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇతర ప్రాంతాల్లోని అంగడి ఆదాయంతో పోల్చి చూస్తే నర్సంపేట సంత ఆదాయం తగ్గుముఖం పడుతూ వస్తుంది. పశువుల రహదారి వేలం గణనీయంగా తగ్గింది. మొత్తంగా 2019-20 ఆర్థిక సంవత్సరం అంగడి అంచనా విలువ రూ.52,19,666 ఉండగా రూ.41.05లక్షల విలువ చేసే వేలం పాటలకు పరిమితంగా నిలిచింది. అంచనాతో పోలిస్తే రూ.11.14లక్షల నష్టం వాటిల్లిందనే చెప్పాలి. 2018-19 ఏడాది కన్నా కేవలం రూ.60వేల అదనపు ఆదాయం మాత్రమే ఈ వేలం పాటల ద్వారా రానుంది. పశువుల రహదారి, డక్కాపై అంచనా రూ.11.27లక్షలు ఉండగా రూ.7.29 లక్షలు, మేకలు, గొర్రెలు రహదారిపై రూ.24.48లక్షల అంచనాకు రూ.22.75లక్షలు, గంప చిట్టీపై రూ.15.65లక్షలుండగా రూ.9.80లక్షల చొప్పున కాంట్రాక్టర్లు వేలం పాడారు. కమేలాపై కిందటేడాది రూ.1.14లక్షలుండగా ఈ ఏడాది రూ.1.21లక్షలతో వేలాన్ని కాంట్రాక్టర్లు చేజిక్కించుకున్నారు. నర్సంపేట పట్టణ అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరుగా పరిగణిస్తున్న అంగడి రోజంటికి ఆదరణ కోల్పోతుందన్న ఆందోళన పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కాంట్రాక్టర్లు బహిరంగ వేలం, సీల్డ్ కవర్ ద్వారా కోడ్ చేసిన టెండర్లను చివరిగా కౌన్సిల్ ఆమోదించడం పరిపాటిగానే సాగుతుంది. అంగడి వేలం పాటల్లో పారదర్శకత లోపిస్తుందన్న విమర్శలు పలువురి నుంచి విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ కౌన్సిల్, ఉన్నతాధికారులు అంగడి బహిరంగ వేలం పాటల్లో నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నట్టయితే అంచనా మేరకు ఆదాయం సమకూరుతుందనే సర్వత్రా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.