Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
పట్టణంలో ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని ఓటేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఉపాధ్యాయుల రాక మొదలైంది. మండలంలో మొత్తం 347 ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉండగా అందులో పురుషులు 184, మహిళలు 133 ఉన్నారు. మొత్తం 318 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 91 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల జోనల్ అధికారి అవినాష్ తెలిపారు. స్థానిక పాఠశాలలో మండల రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేసిన ఓటర్ లిస్ట్లో కొంత మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు.ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు జోనల్ అధికారిగా వ్యవసాయ శాఖ ఏడీ అవినాష్ వ్యవహరించారు. పోలింగ్ ప్రక్రియను తహశీల్దార్ నాగేశ్వర్రావు, ఏసీపీ నర్సింగరావు, సీఐ అజరు పర్యవేక్షించారు. పోలింగ్ అనంతరం అధికారులు బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి నగరానికి పంపించారు.