Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెస్టారెంట్లు, దాబాలను తలపిస్తున్న హోటళ్లు
- దాబాలు, బిర్యానీ సెంటర్లు అడ్డాలుగా దందా
- నాణ్యతపై అధికారుల పట్టింపు కరువు ?
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
మద్యంప్రియుల జల్సాలకు, ఆనందానిచ్చే రెస్టారెంట్లుగా మారిపోతున్నాయి చిన్నచిన్న హోటళ్లు.నెక్కొండలో భోజన ప్రియులకు రుచికరమైన భోజనం అందించాల్సిన హోటళ్లు బార్లు, రెస్టారెంట్లను తలపిస్తున్నాయి. రోజురోజుకు విచ్చలవిడిగా హోటళ్లు, బిర్యాని సెంటర్లు పెరిగిపోతున్నా అధికారుల పర్యవేక్షణ లేదు. హోటళ్లు, దాబాల్లో వ్యాపారులు నాణ్యతను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా తమ వ్యాపారదందాను సాగిస్తున్నారు. దాబాలు, హోటళ్లలో కస్టమర్ల అందించాల్సిన నాణ్యత, ప్రమాణాలను కొరవడిన తీరే ఇందుకు నిదర్శనం. ఇష్టానుసారంగా కస్టమర్లను ఆకర్షించే విధంగా హోటళ్లను నిర్వహిస్తూ భోజనప్రియుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రోజు కూలికి పని చేసే కార్మికులు, ప్రయాణికులు ఆకలితో హోటళ్లకు వెళితే ఇదే అదనుగా భావించి అందినకాడికి దండుకుంటున్నారు. వెరైటీల పేరుతో నాణ్యత లేని కూరలు, భోజనం పెట్టి వినియోగదారుల ఆయుషును తగ్గిస్తున్నారు. ఏ ఒక్క హోటల్లో సరైన వసతులు, సదుపాయాలు లేకున్నా ఇష్టానుసారంగం నడుపుతూ ఎలాంటి సూచికలు లేకుండా వ్యాపారం సాగిస్తుండటం విశేషం. దాబాలు, హోటళ్లలో మద్యం నిషేధం ఉన్నప్పటికీ యథేచ్చగా వ్యాపారులు మద్యం, ఇతరత్రా సప్లై చేస్తున్నారు. మద్యాన్ని ఎన్నికలవేళ నిషేధించినప్పటికీ దాబాలు, హోటళ్లలో మాత్రం అన్నివేళల అందుబాటులో దొరకడం విశేషం.
ప్రచారానికి వైద్య సిబ్బంది దూరం
మండలంలోని ప్రజలకు హోటళ్లు, దాబాల్లో అందించే ఆహార నాణ్యత, ప్రమాణాలపై వైద్య సిబ్బంది ఎన్నడూ పట్టించుకున్న పాపానపోలేదు. ప్రజలకు రుచికరమైన నాణ్యతతో కూడిన భోజనం అందించాలని హెచ్చరించాల్సిన వైద్య, ఆరోగ్య సిబ్బంది తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అంగడివేలలో తోపుడు బండ్లపై విక్రయించే తినుబండారాలు, హోటళ్లు, బిర్యాని సెంటర్లలో ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచనలు చేసిన దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రులకే పరిమితున్నారే తప్పా సమాజంలో జరిగే పరిస్థితులపై వారికి పట్టింపే లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫుడ్ ఇన్స్పెక్టర్ జాడేది ?
బిర్యానీ పాయింట్లు, హోటళ్లు, దాబాల్లో ప్రజలకు ఏవిధమైన భోజనం అందిస్తున్నారని విచారించాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది జాడ నెక్కొండ మండలంలో మచ్చుకైనా కానరావడం లేదు. దుకాణాల్లో తనిఖీ చేయడం గతంలో ఏనాడో విన్నామని, నేటికి ఆ అధికారులు కంటికి సైతం కనిపించరని, కనిపించినా గుట్టుచప్పుకు కాకుండా పని కానిస్తారని అధికారులను పలువురు విమర్శిస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాబాలు, బిర్యానీ పాయింట్లలో నాణ్యమైన నూనెలు, వంట సరుకులతో వంట చేయడంలేదని అధికారులకు ఫోన్లో సమాచారమిచ్చినా ఫలితం లేదని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలైనా, బందైనా హోటళ్లలో, దాబాల్లో...
ఎన్నికలవేళ, ప్రత్యేకించిన దినాల్లో బ్రాందీ షాపులు బంద్ పాటించినా ఇక్కడ మాత్రం అన్ని వేళలో మద్యం దొరుకుతుంది. అధికారులు లైసెన్స్ షాపులను మూసినవేళలో హోటల్, దాబాల్లో మాత్రం అందరికీ అందుబాటులో మద్యం అనే దందాకే తెరలేపుతున్నారు. గాంధీ జయంతైనా, స్వాతంత్య్ర దినోత్సవమైనా మరేదైనా ఈ హోటల్, దాబాల్లో మాత్రం మద్యం ఏరులైపారుతోంది. వీరికి ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిందా అన్న చందంగా వినియోగదారులకు మందు సప్లై చేస్తున్నారు. మందు, విందులతో రోడ్డెక్కిన ప్రమాదాలు జరుగుతున్నా మాకేమి సంబంధం అన్నట్లుంది నెక్కొండలో పరిస్థితి.ఈ పరిస్థితిపై మౌఖికంగా, లిఖితపూర్వకంగా ఫిర్యాదుల చేసినా ఫలితం మాత్రం శూన్యంగానే కనిపిస్తోంది.
స్థానిక అధికారులకు పర్యవేక్షణ కరువు
స్థానికంగా ఉండే అధికారులు హోటళ్లు, బిర్యారీ సెంటర్లు, దాబాల్లో ఎలాంటి దందా సాగిన తమకేమీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వీటిల్లో మద్యం సేవించరాదని నిబంధన ఉన్న ఇష్టానుసారంగా దందా సాగుతున్నా అధికారులు మాత్రం ఆ వైపు చూడటమే మానేసారు. ప్రజలకు నాణ్యమైన బోజనం, ఇతర సదుపాయాలు అందడంలేదని, ఆ సెంటర్లతో తమకు ఇళ్లకు ఇబ్బందులు ఉన్నాయని ఫిర్యాదులున్నప్పటికీ పట్టించుకోవడమే మానేశారు. ఏదీ ఏమైనప్పటికీ ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం హోటళ్లు, బిర్యానీ పాయింట్లు, దాబాల్లో విచారణ చేసి అందించే వసతులు, భోజనం, వినియోగించే సరుకులపై ఆరా తీసి అడ్డగోలు దందాకు అడ్డుకట్టవేయాలని ప్రజలు కోరుతున్నారు.