Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నుంచి 'దొమ్మటి'
- టీడీపీ నుంచి హన్మకొండ సాంబయ్య
నవతెలంగాణ-హన్మకొండ
15-వరంగల్ (ఎస్సీ) లోక్సభ ఎన్నికలకు నామినేషన్లు జోరందుకున్నాయి. ఇది వరకే బీఎస్పీ తరపున బరిగెల శివ, కాంగ్రెస్ నుంచి మార్త రాజభద్రయ్య నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అధిరారికంగా దొమ్మటి సాంబయ్య, టీడీపీ తరపున హన్మకొండ సాంబయ్య, బీజేపీ నుంచి బొక్క ప్రభాకర్, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి గాదెపాక అనిల్కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా ఐత ప్రవీణ్కుమార్, జెరిపోతుల ఉపేందర్ నామినేషన్ వేశారు. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ తరపున ఆరెల్లి అంజన్నావు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఒకరోజే 9 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
25న మాత్రమే గడువు : కలెక్టర్
లోక్సభ ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి ఈనెల 25 ఒకరోజు మాత్రమే గడువు ఉందని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. 23న నాల్గో శనివారం ఎన్నికల సంఘానికి సెలవని పేర్కొన్నారు. 24న ఆదివారం కావడంతో సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో 23, 24 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ ఉందని తేటతెల్లం చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులకు, పార్టీలకు నామినేషన్ ప్రొఫార్మాలు ఇచ్చేందుకు సుబేదారిలోని పాత కలెక్టరేట్లో సెలవు రోజుల్లోనూ రిసెప్షన్ సెంటర్ పని చేస్తుందని తెలిపారు. నామినేషన్ పత్రాలకు జత చేయాల్సిన సర్టిఫికెట్ల గురించి రిసెప్షన్ సెంటర్లో వివరిస్తారని పేర్కొన్నారు.