Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదు
- జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
- ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీ
నవతెలంగాణ-ములుగు
ప్రజలకు అధికారులు అందుబాటులో ఉం డాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశిం చారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదని ఆయన హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల, మత్స్య శాఖ కార్యాలయాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మత్స్య శాఖ కార్యాలయంలో రికార్డులు సరిగా లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యాలయాల్లో కార్యకలాపాలు సరైన రీతిలో సాగడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రౌండ్ వాటర్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ, సోషల్ వెల్ఫేర్, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయాల్లో సత్వరమే సిబ్బందిని ఏర్పాటు చేసుకొని సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. శాశ్వత ప్రాతిపదికన కార్యాలయాల సూచిక బోర్డులు, ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతరత్రా మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. అలాగే ల్యాండ్లైన్ ఫోన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఏర్పాట్ల కోసం ఒక్కో శాఖకు లక్ష రూపాయలు చొప్పున మంజూరు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. మరో రెండ్రోజుల్లో కార్యాలయాలను సందర్శిస్తానని చెప్పారు. విధుల పట్ల అలసత్వం వహించే అధికారుల మీద వేటు తప్పదని స్పష్టం చేశారు. కార్యాలయ అధికారులు క్షేత్రపర్యటనలో ఉంటే కింది స్థాయి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) తుల రవి, ఇతర అధికారులున్నారు.