Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వే బూచితో తిరస్కరణ
- 'మాలోత్'కు మద్దతేది..?
నవతెలంగాణ-వరంగల్
సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంతో మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ సీతారాంనాయక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తనకు టికెట్ దక్కకుండా చేయడం వెనుక కుట్ర ఉందని సన్నిహితుల వద్ద సీతారాం వాపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో సర్వే నివేదిక తనకు వ్యతిరేకంగా వచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించినట్లు తెలిసింది. సర్వే బూచితో ఉద్దేశపూర్వకంగానే టికెట్ ఇవ్వలేదని సమాచారం. అసెంబ్లీ ఎన్నిలకు ముందు సీతారాంనాయక్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు జరిగిన ప్రచారమే ఆయనకు ముప్పుగా పరిణమించింది. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీతారాం స్పష్టం చేసినట్లు అనుచరవర్గం చెబుతోంది. టికెట్ రాకుండా అడ్డుకోవడం వెనుక ఎవరున్నారనే విషయంలో ఆయన గుర్రుగా ఉన్నట్లు సమాచారం.స్వరాష్ట్ర ఉద్యమం నుంచి కేయూలో జరిగిన పోరాటంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ను 2014లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బరిలోకి దించింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సీతారాంనాయక్ 35 వేల మెజార్టీతో విజయం సాధించారు. వివాదరహితుడిగా ఉన్న సీతారాంనాయక్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి ఇద్దరు, ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్లో చేరనున్నారని ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. అధినాయకత్వం పరిశీలనలో చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ కాంగ్రెస్ నాయకత్వంతో టచ్లో ఉన్నట్లు తేలింది. ఆ ఇద్దరిని నాయకత్వం సంప్రదించిన నేపథ్యంలో ఆ ప్రచారాన్ని ఇద్దరూ ఖండించారు. అనంతరం కొద్ది రోజులకే చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి టీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాత్రం టీఆర్ఎస్లోనే ఉండిపోయారు. కాంగ్రెస్ ప్రచారం అబద్ధమని, ఆ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని, టీఆర్ఎస్లోనే కొనసాగుతానని సీతారాంనాయక్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీతారాంనాయక్తో చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్పై హామీ సైతం ఇచ్చినట్లు సీతారాంనాయక్ అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎంత దుష్ప్రచారం జరిగినా అధినేత హామీతో సీతారాంనాయక్ ధీమాతో ఉన్నారు. ఎట్టకేలకు పలు కారణాలు చూపి టికెట్ను తిరస్కరించడంతో సీతారాంనాయక్ కుటుంబం మనస్తాపానికి గురైంది.
సర్వే బూచితో తిరస్కారం..?
మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్కు సర్వే బూచితో పార్టీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు భేటీ అయ్యారు. ఇందులో కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. మంత్రి దయాకర్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనిది. ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన నేత. ఈ లోక్సభ నియోజకవర్గానికి చెందిన నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, శంకర్నాయక్, రెడ్యానాయక్లతో సీఎం భేటీ జరగలేదు. ఈ ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. అయినా వీరి అభిప్రాయాలు తీసుకోకుండానే సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
'మాలోత్'కు మద్దతేదీ..?
సీఎం కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితకు పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేయడం వెనుక ఎమ్మెల్యేల అభిప్రాయాలు ఏమీ లేవనేది సుస్పష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ సీతారాంనాయక్కు అవకాశం ఇవ్వద్దని భావించాక ప్రత్యామ్నాయంగా కవిత పేరును తెరపైకి తెచ్చారు. కవితకు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్కు మధ్య విభేధాలున్నాయి. కవితకు అనుకూలంగా శంకర్నాయక్ అభిప్రాయం చెప్పే అవకాశం లేదు. అలాగే ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్కు కవిత తండ్రి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్తో విభేధాలున్నాయి. ఏరకంగా చూసినా కవిత పట్ల వారంతా అనుకూలంగా అభిప్రాయం చెప్పే అవకాశం లేదు. ఏది ఏమైనా సీతారాంనాయక్కు ఇవ్వకపోవడం వెనుక అసమర్ధత, నిలకడ లేమితనం కారణాలుగా చెబుతున్నా టీఆర్ఎస్ జాబితాలో అసమర్ధులు లేరా ? అన్న ప్రశ్న ఉత్పన్నం కాక మానదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ చేయాలనుకున్నది చేశారనేది తేటతెల్లం.