Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్బెల్ట్
ఈ నెల 24 నుంచి దేశవ్యాప్తంగా బొగ్గు రంగ పరిశ్రమలలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా తలపెట్టిన సమ్మెను కార్మికవర్గం యూనియన్లకు అతీతంగా జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమ్మెను ఉద్ధేశించి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచి కార్యదర్శి మోటపలుకుల రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు రంగ పరిశ్రమల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ)ప్రోత్సహించడం ఒక రకంగా దేశానికి, కార్మికలోకానికి తీరని ద్రోహమని మండిపడ్డారు. 1947కు పూర్వం పూర్తి స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం కార్మికులు సమ్మెలు, పోరాటాలు చేస్తేనే ఆంగ్లేయులు దేశం విడిచి పారిపోయారని ఆనాడు ఆర్ఎస్ఎస్ వారికి మద్దతుగా నిలిచిందని, నేడు ఆర్ఎస్ఎస్ అనుబంధ రంగ బీజేపీ అదే ధోరణి అవలంభిస్తున్నందున కార్మికులు మళ్లీ పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐఎన్టీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు జోగ బుచ్చయ్య మాట్లాడుతూ పరిశ్రమల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, ఎఫ్డీఐలకు పార్లమెంట్ వేదికగా జరిగే కుట్రలను తిప్పికొట్టాలని, విదేశీయులు, కార్పోరేట్ల చేతిలో మోడీ కీలుబొమ్మగా మారారని, అన్ని రంగాలను ప్రయివేటీకరించే ధోరణిలో ఉన్నారని, కార్మికుల కన్నెర్రతో ప్రభుత్వం దిగి రావాలని, సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ)బ్రాంచి ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య మాట్లాడుతూ గతంలో ఒక్క రోజు సమ్మెలో 18కోట్ల మంది పాల్గొన్నారని, రేపు జరగబోయే ఒక్క రోజు సమ్మెలో అంతకన్న ఎక్కువ మంది పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ కార్మికులవలె సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఎఫ్డీఐలను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. 25వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొనాలని, సమ్మె సెగ ఢిల్లికి తగలాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు బందు సాయిలు, ఏఐటీయూసీ నాయకులు పర్వతాలు, ఐఎన్టీయూసీ నాయకులు లక్ష్మినారాయణ, కృష్ణ పాల్గొన్నారు.