Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆహార భద్రత కార్డులో పేర్కొనబడిన 18 యేండ్ల పైబడిన మహిళలకు బతుకమ్మ చీరలను ప్రభుత్వం అందజేయనుంది. గ్రామ కార్యదర్శి, రేషన్ డీలర్, వీవో మహిళా ప్రతినిధుల పర్యవేక్షణలో ఈ చీరలను అర్హులైన వారికి పంపిణీ చేయనున్నారు. ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ చీరలను పారదర్శకంగా పంపిణీ చేయాల్సి ఉంది. కిందటేడాది బతుకమ్మ చీరల పంపిణీలో అవకతవకలు చోటు చేసుకోవడంతో అనేక మంది మహిళలు అర్హులైనప్పటికీ బతుకమ్మ చీరలు అందలేదు. పంపిణీలో పారదర్శకత లోపించినందునే మహిళలందరికీ బతుకమ్మ చీరలు అందకుండా పోయాయనే విమర్శలు ఉన్నాయి. గ్రామంలో ఉన్న మహిళలందరికీ ఒకే చోట పంపిణీ చేయడం ద్వారా గలాటా చోటు చేసుకుంది. బారులు తీరి చీరలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు మహిళలు పంపిణీ ప్రదేశంలో రద్దీని, గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి ఎదుర్కోలేక చీరలను తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఈ సారి కూడా ఒకే ప్రదేశంలో చీరల పంపిణీ చేయనుండటంతో కిందటేడాది పరిస్థితే పునరావృతమవుతుందా..! అని పలువురు మహిళలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపుల వద్ద పంపిణీ చేసినట్లయితే రద్దీ కాస్త తగ్గి, ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఈ మేరకు స్పందించాల్సిన అవసరం ఉంది.
ఇదిలా ఉంటే చీరల కోసం మహిళలు తమ ఆధార్కా, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులు ఇవ్వాలనే నిబంధనలు కూడా అర్థరహితమనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఏకకాలంలో జిరాక్స్ ప్రతులు తీసుకోవడానికి ఇబ్బందులే కాకుండా అదనంగా డబ్బులు కూడా వెచ్చించాల్సిన పరిస్థితి ఆయా గ్రామాల్లో ఉంది. ఇక జిరాక్స్ మిషన్లు లేని గ్రామాల్లో ఇచ్చే ఆ కాస్త చీరకు అదనంగా డబ్బులు వెచ్చించి వ్యయప్రయాసాల భారం మోపడం ఎంతవరకు సమంజసమంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు.
ఇక నర్సంపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా దూరప్రాంతాలైన ద్వారకపేట, సర్వాపురం, వల్లభ్ నగర్, కమలాపురంకు చెందిన మహిళలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పేలా లేదు. ఈ సారి ఆరు రేషన్ షాపులకు ఓ ప్రాంతాన్ని ఎంచుకొని చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో అధికారులు తగిన షెడ్యూల్ను విడుదల చేశారు. నర్సంపేట రూరల్ మండలంలో 14 వేల మందికి, పట్టణంలో 11,786 మంది మహిళలకు చీరలను కేటాయించారు. మొత్తంగా రేషన్ కార్డుల్లో పేర్కొనబడిన మహిళల్లో 1 0శాతం కోత విధించినట్లు తెలుస్తున్నది. ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు, ఆహార భద్రత కలిగిన వారిలో కొందరు ఆర్థికంగా బలపడిన వారు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరు చీరలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. కిందటేడాది వరకు చీరల పంపిణీ అక్విడెన్స్ రిజిస్టర్ల ప్రకారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే 10 శాతాన్ని కుదించినట్లు తెలుస్తుంది.
పట్టణంలో చీరల పంపిణీ షెడ్యూల్ విడుదల..
నర్సంపేట పట్టణంలో నేటి నుంచి పంపిణీ చేసే బతుకమ్మ చీరల పంపిణీ షెడ్యూల్ను కమిషనర్ ఏ వెంకటేశ్వర్ రావు విడుదల చేశారు. 19 రేషన్ షాపుల పరిధిలోని ఆహార భద్రత కార్డుల్లో మహిళ లబ్ధిదారులను గుర్తించారు. రేషన్ షాపు నెంబర్ 10 పరిధిలో 481, 4 పరిధిలో 653, 34 పరిధిలో 618 మంది లబ్ధిదారులకు ఒకే ప్రదేశంలో చీరల పంపిణీ ఉంటుందని తెలిపారు. పర్యవేక్షకులుగా టీ.సంపత్ కుమార్, ఆర్పీలు ఎన్.రాధ, ఆర్.శోభ, రేషన్ డీలర్ వీ.యాకేందర్ పర్యవేక్షణ అధికారులుగా వ్యవహరించనున్నారు. రేషన్ షాపు నెంబర్ 1 పరిధిలో 326, 2 పరిధిలో 937, 9 పరిధిలో 703 24వ తేదిన రేషన్ షాపు నెంబర్ 19 పరిధిలో 782, 20 పరిధిలో 607, 21 పరిధిలో 687, 7 పరిధిలో 624, 36 పరిధిలో 688, 12 పరిధిలో 673 మందికి పంపిణీ చేయనున్నారు. ఈ నెల 25న షాపు నెంబర్ 35 పరిధిలో 519, 3 పరిధిలో 600, 08 పరిధిలో 763, 5 పరిధిలో 433, 6 పరిధిలో 797, 11 పరిధిలో 504, షాపు నెంబర్ 26 పరిధిలో 399 మంది మహిళలకు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన 6 ప్రదేశాల్లో నిర్వహించనున్న ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే తదితర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు కమిషనర్ షెడ్యూల్లో పేర్కొన్నారు.
బతుకమ్మ చీరల పంపిణీ ప్రదేశాలు:
రేషన్ షాపు నెంబర్ 10 కోసం జీఆర్ గార్డెన్ వెనుక ఉదయం 9:30కు, రేషన్ షాపు నెంబర్ 4 షాదీఖానా, రేషన్ షాపు నెంబర్ 1 తహసీల్దార్ కార్యాలయం పక్కన, రేషన్ షాపు నెంబర్ 34 మల్లంపెల్లి రోడ్డు అరవింద థియేటర్ ఎదురుగా, రేషన్ షాపు నెంబర్ 2 వీరబ్రహ్మంగారి గుడి, రేషన్ షాపు నెంబర్ 9 జయలక్ష్మీ సెంటర్ టీఆర్ఎస్ కాలనీ ప్రదేశాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరుకానున్నారు.