Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
వివాహాల నమోదును గ్రామ పంచాయతీల్లోనే చేసుకునేందుకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. దీంతో గ్రామస్తులకు దూరభారం తప్పడంతోపాటు బ్రోకర్ల బెడద తప్పేందుకు ఈ కార్యక్రయం ఎంతగానో దోహదపడుతుందని అంతా భావించారు. కానీ మండలంలోని 05 గ్రామపంచాయతీల్లో వివాహ నమోదు ప్రకియ నమోదు కార్యక్రమం ఊసేలేకపోగా.. ప్రజలకు ఇప్పటికీ ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించలేదు. జనన, మరణ నమోదు మాదిరిగానే వివాహాలకు చట్ట భద్రత కల్పించేందుకు వీలుగా గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులకు, మున్సిపాల్ కార్యాలయాల్లో కమిషనర్లకు అధికారాలు ఇచ్చారు. కానీ గ్రామాల్లో మాత్రం అధికారులు ఈ ప్రక్రియలో వేగం పెంచలేకపోతున్నారు. మండలంలో ప్రభుత్వ ఆదేశాలు ఇంకా అమలు కావడం లేదు.
అవగాహన శూన్యం..
రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకానికి మొదట్లో వివాహ నమోదు అడగనప్పటికీ ప్రస్తుతం తప్పనిసరి చేసింది. దీంతో మండలంలోని 05 గ్రామపంచాయతీల పరిధిలో వివాహాల నమోదు కోసం భూపాలపల్లి జిల్లా దాటి సుమారుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా కేంద్రంలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తున్నారు. చాలా మందికి గ్రామపంచాయతీల్లో వివాహ నమోదు ప్రక్రియ గురించి అవగాహన లేదు. ఇందుకు సంబంధించి గ్రామల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఇప్పటికీ వివాహమైన వెంటనే ప్రజలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నమోదు చేసుకుంటున్నారు. జీపీల్లోనే ధృవీకరణ పత్రాలు ఇస్తారని సంబంధితశాఖ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు.
దరఖాస్తు చేసుకునే విధానం..
వివాహ నమోదు ప్రక్రియకు వధూవరులు జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు నకలు పత్రాలు, పాస్పోర్ట సైజ్ ఫోటోలు, పెళ్లిఫోటోలు, శుభలేఖతో పాటు వివాహ ధృవీకరణకు ముగ్గురు సాక్షుల సంతకాలు అవసరం. అలాగే విద్యార్హత సర్టిఫికెట్ లేదా వయస్సు నిర్దారణ పత్రాలతో స్థానిక గ్రామపంచాయతీకి వధూవరులు సాక్షులతో పాటు వెళ్లి కలవాలి. దీంతోపాటు దరఖాస్తు ఫారాలను నింపి కార్యదర్శికి అప్పగిస్తే వెంటనే వివాహ నమోదు పత్రాన్ని అందిస్తారు.
ఎవరికీ తెలియదు..
వివాహ నమోదు గ్రామపంచాయతీల్లో చేసుకోవచ్చనేది విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. దీంతో ఎక్కువ మంది రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తున్నారు. అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి.
- అక్కల బాపు యాదవ్
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
పని సులువు..
రిజిస్ట్రార్ కార్యా లయాల్లో చిన్న పొరపాటు జరిగినా మళ్లీ మళ్లీ వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన పంచాయతీల్లోనే వివాహ నమోదు దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తులో ఏమైనా పత్రాలు తక్కువ ఉన్నా తిరిగి ఇవ్వొచ్చు. దీంతో పని సులువవుతుంది.
- గంగుల రమేష్, పెద్దతూండ్ల
పంచాయతీల్లో నమోదు చేసుకోవాలి..
ప్రజలకు వివాహ నమోదు గురించి వివరించాలని ఇప్పటికే కార్యదర్శులకు తెలియ జేశాము. ప్రజలు గ్రామాల్లోనే వివాహ నమోదు చేసుకోవచ్చని అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నాం.
-నరసింహమూర్తి
ఎంపీడీవో