Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
ప్రయాణికుల సౌకర్యార్థం లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ నిరుపయోగంగా ఉంటోంది. చిట్యాల మండల కేంద్రంలో 10 జూన్ 2016న అప్పటి రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ బస్టాండ్ నిర్మాణానికి రూ. 24.8 లక్షల నిధులు మంజూరు చేయగా అప్పటి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి శంకుస్థాపన చేశారు. అనంతరం కాంట్రాక్టర్ పనులు ప్రారంభించిన ఏడాదిలోపే బస్టాండ్ నిర్మాణ పనులు పూర్తి చేశాడు. నిర్మాణం పూర్తయ్యి ఇప్పటికి రెండేండ్లు కావస్తున్నా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడంతో ప్రయాణికులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు బస్టాండ్ విషయాన్ని పట్టించుకోక పోవడంతోగ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దీనిని అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మూడు మండలాలకు చెందిన ప్రజలు నిత్యం బస్సు సౌకర్యం కోసం ఎండలో, వానలో ఇబ్బందులకు గురవుతూ బస్సుల కోసం వేచి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో పెద్ద మండలమైన చిట్యాల బస్టాండ్ను నాయకులు పట్టించుకోకుండా లక్షల వ్యయంతో నిర్మించిన బస్టాండ్ను ప్రారంభించక పోవడం శోచనీయం అన్నారు. చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలను కలుపుతూ కరీంనగర్ వేములవాడ క్షేత్రానికి సుమారు 40 నుంచి 50 గ్రామాల ప్రజలు నిత్యం చిట్యాల మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ని మండలాల ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్టాండ్ ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండల ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి స్పందించి బస్టాండ్ను వెంటనే ప్రారంభించి ఆర్టీసీ బస్సులు బస్టాండ్ వరకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అలాగే బస్టాండ్లో మూత్రశాలలు ఏర్పాటు చేయాలని మహిళలు, విద్యార్థులు, గ్రామస్తులు వేడుకుంటున్నారు.