Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ గుండా ప్రకాశరావు
- 47వ డివిజన్లో నగరబాట కార్యక్రమం
నవతెలంగాణ-వరంగల్
ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని మున్సిపల్ మేయర్ గుండా ప్రకాశరావు అన్నారు. ఆదివారం నగరబాట కార్యక్రమంలో భాగంగా 47వ డివిజన్లోని గోకుల్నగర్, రాంనగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో కమిషనర్తో కలిసి ఆయన క్షేత్రస్థాయి
పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగర ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి నగర బాట కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే సత్వరమే పరిష్కరిస్తామని ప్రజలకు సూచించారు. పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు ప్రభలే వీలుందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని డీఈని ఆదేశించారు. డ్రైన్లలో ఎప్పటికప్పుడు సిల్డ్ తొలగించాలని ఆరోగ్యాధికారిని ఆదేశించారు. రామ్నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి నూతన భవన నిర్మాణం చేపట్టగా వ్యర్థాలను మురుగు కాల్వలో వేసినందుకు రూ.10వేల జరిమానా విధించాలని ఆరోగ్య అధికారిని ఆదేశించారు. ప్రెసిడెన్సీ పాఠశాల ఎదుట నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు రాగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్మాణాన్ని రద్దు చేయాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. విద్యానగర్లో డ్రయినేజీ నిర్మాణాల కోసం బిల్లులు వెంటనే చెల్లిస్తామమని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు స్వరూపరాణి, సుధాకర్రెడ్డి, చాడ స్వాతిరెడ్డి, ఆరోగ్య అధికారి రాజారెడ్డి, ఎలక్ట్రికల్ ఈఈ లక్ష్మారెడ్డి, డీఈ రవికుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ భాస్కర్, ఏఈలు విజయలక్ష్మి, ఆజ్మీర శ్రీకాంత్ పాల్గొన్నారు.