Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ రూరల్లో ఎన్నిక ఏకగ్రీవం ?
- చైర్మెన్గా 'నిమ్మగడ్డ' !
నవతెలంగాణ-వరంగల్
రెడ్క్రాస్ సొసైటీల్లో రాజకీయ నేతలు చొచ్చుకురావడం ఆనవాయితీగా మారింది. గతంలో సమాజ సేవలో ఉన్న ప్రముఖులు మాత్రమే ఈ సొసైటీకి మూడేండ్లపాటు ప్రాతిని ధ్యం వహించే వారు. తాజాగా రాజకీయ నేతలు సొసైటీ పాలక వర్గంలోకి చొచ్చుకురావడం చర్చనీయాంశంగా మారింది. రెడ్క్రాస్ సొసైటీ వరంగల్ అర్బన్ జిల్లా పాలకవర్గం ఎన్నికల్లోనే ఇది ప్రారంభం కాగా, ఇప్పుడు వరంగల్ రూరల్ జిల్లా పాలకవర్గ ఎన్నికల్లో ఇదే పునరావృతమైంది. జిల్లా సొసైటీలో ఉన్న 700 సభ్యత్వాల్లో ఒక్క పరకాల నియోజకవర్గానికి సంబంధించినవి 400 ఉండడం గమనార్హం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా మంగళవారం వరంగల్ రూరల్ కలెక్టరేట్లో నామినేషన్ ప్రక్రియలో రాజకీయ వాతావరణం కనిపించింది. పరకాల నియోజకవర్గానికి చెందిన సుమారు 20-30 వాహనాలతో నేతలు కలెక్టరేట్కు చేరుకొని నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్కు చెందిన జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, నేతలు పెద్ద ఎత్తున నామినేషన్ ప్రక్రియకు తరలొచ్చారు. ఇది చర్చనీయాంశంగా మారింది. వరంగల్ రూరల్ జిల్లాలో ప్రధానంగా పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలున్నాయి. పాలకుర్తి, భూపాలపల్లి నియోజక వర్గాలకు చెందిన ఒక్కో మండలం ఈ జిల్లా పరిధిలో ఉండడంతో ఎన్నికలు ఏకపక్షవవుతున్నాయి. రూ.1,020తో సభ్యత్వం తీసుకున్న వారు ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు. రెడ్క్రాస్ సొసైటీ వరంగల్ రూరల్ జిల్లా పాలకవర్గం 12 మందితో ఏర్పడనుంది. మంగళవారం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 12 పోస్టులకు గాను 12 మంది మాత్రమే నామి నేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 20వ తేదీన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ప్రకటించనున్నారు.
నమినేషన్లు వేసింది వీరే.....
వరంగల్ రూరల్ కలెక్టరేట్లోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియకు ఆర్డీఓ మహేందర్జీ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కాగా డాక్టర్ చల్లా మధుసూదన్, నర్మెటి రాజేంద్రనాథ్, డాక్టర్ గజవెల్లి రాజ్కుమార్, దుంపలపల్లి బుచ్చిరెడ్డి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, డాక్టర్ పోతని రాజేంద్రప్రసాద్, బండి సారంగపాణి, నాడెం శాంతికుమార్, తోట రాము, గోనె మల్లయ్య, లెక్కల విద్య, బక్కి అర్జున్లు నామినేషన్లు దాఖలు చేశారు. చల్లా మధుసూదన్ వరంగల్ రూరల్ జిల్లా వైద్య, ఆరోగ్యాధికారిగా పనిచేస్తున్నారు. పరకాలకు చెందిన డాక్టర్ పోతని రాజేంద్రప్రసాద్ వరంగల్ అర్బన్ జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డాక్టర్ లలిత భర్త కావడం గమనార్హం. డాక్టర్ రాజ్కుమార్ వర్ధన్నపేటకు చెందిన వారు. డాక్టర్ లెక్కల విద్య ఎంజీఎం ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. డాక్టర్ లెక్కల విద్య నర్సంపేటలోని ఒక ప్రయివేటు ఆస్పత్రి యజమాని డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి సతీమణి.
రెడ్క్రాస్ చైర్మెన్గా 'నిమ్మగడ్డ'
రెడ్క్రాస్ సొసైటీ వరంగల్ రూరల్ జిల్లా చైర్మెన్గా పరకాల నియోజకవర్గం సంగెం మండలానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు ఎన్నిక కానున్నారు. 12మందితో ఏర్పడే పాలకవర్గంలో ఒకరు చైర్మెన్గా, ఒకరు వైస్చైర్మెన్గా, మరొకరు ట్రెజరర్గా ఎన్నుకుంటారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా కొనసాగుతారు. వైస్చైర్మెన్, ట్రెజరర్ పదవులకు సంబంధించి డాక్టర్ సీహెచ్. మధుసూదన్, డాక్టర్ ఎన్. రాజేంద్రప్రసాద్ పోటీపడుతున్నట్టు సమాచారం.
ఎమ్మెల్యేల సమన్వయంతోనే..?
ఇదిలావుంటే రెడ్క్రాస్ సొసైటీ జిల్లా పాలకవర్గం ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య చర్చల నేపథ్యంలోనే చైర్మెన్, వైస్చైర్మెన్, ట్రెజరర్ను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరకాల నియోజకవర్గానికి చెందిన నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు చైర్మెన్గా ఎన్నికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పరకాల నియోజకవర్గ ఓటర్లే అధికంగా ఉండడంతో మొదటి ప్రాధాన్యత పరకాలకే దక్కే అవకాశముంది. వైస్ చైర్మెన్, ట్రెజరర్ పోస్టులలో ఒకటి నర్సంపేటకు పోయే అవకాశం కనిపిస్త్తోంది. ఒక పోస్టు మళ్లీ పరకాల నియోజకవర్గానికే దక్కే అవకాశం లేకపోలేదు.