Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదలైన ఎండలు
- అధిక శాతం ఎండిపోయే అవకాశం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
రెప్పపాటు కూడా కరెంట్ పోదు. వ్యవసాయానికి 24 గంటల ఇస్తాం. రైతులు భరోసాతో ఉండండి. నన్ను నమ్మి ఓట్లెయ్యండి. ఇది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ. రెప్పపాటు కాదు రోజుకు 20 సార్లు వచ్చి పోతుంది. ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలా ఉండడంతో రబీ పంట చేతికి వస్తుందా అన్న అనుమానంలో రైతన్న ఉన్నాడు. చివరి మడులు ఇప్పుడు ఎండుతుండడంతో అధిక శాతం ఎండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 18 లక్షలకు పైగా సాగుభూములు ఉన్నాయి. ఖరీఫ్లో 13లక్షలు, రబీలో 8 నుండి 9లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది రబీలో ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. ఉహించని విధంగా సాధారణ సాగుకు మించి సాగైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరిసాగు 3.22లక్షలు కాగా 4.37వేల 500 ఎకరాల్లో సాగైంది. నిత్యం కరువుకు గురయ్యే జనగామ జిల్లాలో వరి సాధారణ సాగు 53వేల 747 ఎకరాలు కాగా 70వేల 357 ఎకరాల్లో సాగైంది. ఇలా అంచనాలకు మించి వరి సాగైంది. దీనికి కారణం ఖరీఫ్లో ఆలస్యంగా వర్షాలు కురవడంత చెరువుల్లోకి నీరు చేరి భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో రైతులు సంతోషంగా వరి నాట్లు వేశారు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బోర్లు, బావుల కిందనే వరి సాగు జరుగుతుంది. 3లక్షల 16వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటి కిందనే మూడు లక్షల ఎకరాల్లో సాగవుతుండగా లక్నవరం, రామప్ప, పాకాల కింద లక్షా 50వేలకు పైగా ఎకరాల్లో సాగవుతుంది. బావులు, బోర్ల కింద వేసిన వరికి విద్యుత్ ఎంతో అవసరం. మార్చి, ఏఫ్రిల్ మాసంలో విద్యుత్ సమస్య తలెత్తుతుందని భావించగా ఫిబ్రవరి నుండే మొదలైంది. గత ఐదు రోజులుగా ప్రతి రోజు పగలు 20 సార్లు ట్రిప్ అవుతుందని రైతులు వాపోతున్న పరిస్థితి. దీంతో పొలాల పారకం ముందుకు సాగడం లేదు.
పెరగనున్న విద్యుత్ వినియోగం
గతంతో పోలిస్తే విద్యుత్ వినియోగం పెరగనుంది. 2015-16తో చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఫిబ్రవరిలో 230 మిలియన్ యూనిట్లు కేటాయించగా 267 నుండి 270 యూనిట్ల వాడకం జరిగేది. మార్చిలో 240 యూనిట్లు కేటాయించగా 280 మిలియన్ యూనిట్ల వాడకం జరిగేది. అప్పులు పంట సాగు తక్కువ. భూగర్భ జలాలు పడిపోవడంతో రైతులు వేసిన వరి పంట 3లక్షల ఎకరాలకు మించలేదు. ఇప్పుడు ఫిబ్రవరిలో 450 మిలియన్ యూనిట్ల వాడకం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కేటాయించింది మాత్రం 360 మిలియన్ యూనిట్లు మాత్రమే. ప్రతి రోజు 14 నుండి 15 మిలియన్ యూనిట్ల వాడకం జరగనుంది. అందులో వ్యవసాయానికే 10 మిలియన్ యూనిట్లుకు పైగా వినియోగం జరగనుంది. పంటల సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ట్రాన్స్కో అదనపు విద్యుత్ను కేటాయించాల్సి ఉంది. విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం, ట్రాన్స్కో ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ కోతలు మొదలు కావడంతో వేసిన పంట చేతికి వస్తుందా లేదా..అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎండుతున్న వరి పొలాలు
విద్యుత్ సమస్య కారణంగా వరి పొలాలు ఎండడం ఇప్పటి నుండే ప్రారంభమైంది. జనగామ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో చిటకోడూరు గ్రామం ఉంది. దానికి పై భాగంలో రిజర్వాయర్ ఉండగా ఈ ఏడాది మత్తడి పోసింది. దీని సామర్థ్యం కూడా ఎక్కువనే. భూగర్భ జలాలు భాగానే ఉన్నాయి. విద్యుత్ సమస్య మూలంగా జపాన్ శ్రీను పొలం కింద భాగం ఒక మడి ఎండింది. చిటకోడూరులోనే కాకుండా శామీర్పేట గ్రామంలో నీటి పారకం జరగదని భావించిన రైతులు ముందే ఒక మడిని వదలిపెట్డారు. ఇలా రైతుల పొలాలు ఎండిపోవడం మొదలైంది. దీనికి విద్యుత్ సమస్యనే కారణంగా కనిపిస్తుంది. గోదావరి జలాలలో చెరువుల్ని నింపగా ఇప్పటికీ నీరు ఉంది. దీంతో భూగర్భ జలాలు కూడా ఉన్నాయి. విద్యుత్ సమస్య లేకుండా చూస్తే వేసిన పంటలు పూర్తి స్థాయిలో చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.