Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముసాయిదా తీర్మానంపై కుదరని ఏకాభిప్రాయం
కైరో : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయిల్ మధ్య గతనెల్లో కుదిరిన సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ ఒప్పందాన్ని ఖండిస్తూ అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు ముసాయిదా తీర్మానంపై ఒక అంగీకారానికి రావడంలో విఫలమైనట్లు అరబ్ లీగ్ తెలిపింది. సమావేశంలో తీవ్రంగా, సమగ్రంగా చర్చ జరిగిందనీ, కానీ, పాలస్తీనా ప్రతినిధి వర్గం ప్రతిపాదించిన తీర్మానంపై ఏకాభిప్రాయం కుదరలేదని లీగ్ సహాయ సెక్రటరీ జనరల్ హౌసమ్ జకీ కైరోలో జరిగిన పత్రికా సమావేశంలో తెలిపారు. ఆ తీర్మానం స్థానంలో మరో తీర్మానమేదీ కూడా ఆమోదించలేదని జకీ తెలిపారు. తాము ఏదైతే ప్రతిపాదించామో ఆ అంశాలు లేకుండా ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించరాదని పాలస్తీనా వర్గం పట్టుబడుతోందన్నారు. సాధారణ పరిస్థితులు పునరుద్ధరించే ఈ క్రమాన్ని వ్యతిరేకించాల్సిందిగా పాలస్తీనా విదేశాంగ మంత్రి ఇతర సహచర మంత్రులను కోరారు. మధ్యప్రాచ్య ఘర్షణలపై సంవత్సరాల తరబడి అనుసరిస్తున్న అరబ్ లీగ్ విధానాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఇజ్రాయిల, యూఏఈల మధ్య ఫోన్, వైమానిక సంబంధాల పునరుద్ధరణ ఇప్పటికే జరింది. కాగా ఈ ఒప్పందాన్ని పాలస్తీనా ఖండిస్తూ, దీన్ని 'మోసం, ద్రోహం'గా అభివర్ణించింది. 2002లో 22మంది సభ్యులు గల అరబ్ లీగ్ సౌదీ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను ఆమోదించింది. 2017లో మళ్లీ పునరుద్ధరించారు. 1967లో ఆరు రోజుల పాటు సా గిన యుద్ధంలో ఆక్రమించిన భూభాగాల నుండి ఇజ్రాయిల్ బలగాలు పూర్తిగా వైదొలగితేనే సాధారణ సంబంధాలు నెలకొంటాయని ఆ శాంతి ఒప్పందం పేర్కొంది.