Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-లాక్డౌన్తో కర్బన ఉద్గారాలు తగ్గాయి.. కానీ !
- గ్రీన్హౌస్ వాయువుల సాద్రత పెరగడాన్ని నిరోధంచలేదు: ఐరాస నివేదిక
న్యూయార్క్: కరోనా కారణంగా యావత్ ప్రపంచం ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టివేయబడింది. అయితే, కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా కర్బన ఉద్గారాల తగ్గుదల ఒక్కటే సానుకూల అంశం. ఈ సమయంలో కర్భన ఉద్గారాలు బాగా తగ్గాయన్నది నిజమే కానీ, వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత నిరంతరం పెరగడాన్ని నిరోధించలేదని తాజాగా 'ఐక్యరాజ్య సమితి' నివేదిక వెల్లడించింది. ఐరాస-'యునైటెడ్ ఇన్ సైన్స్ రిపోర్టు' ప్రకారం.. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా 2019తో పోలిస్తే.. ఈ ఏడాది జులైలో గ్రీన్హౌస్ వాయువుల రోజువారీ ఉద్గారాలు 17 శాతం తగ్గాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్డౌన్ సడలింపులు ప్రకటించడంతో తిరిగి ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గడిచిన ఐదేండ్ల మధ్య కాలం (2016-2020)లో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరగడంతో భూతాపం భారీగా పెరిగిందని అధ్యయనం కనుగొంది. ఫలితంగా వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల ప్రభావం తగ్గకపోగా.. వాటి ప్రభావాలు మరింతగా పెరుగుతున్నాయని తెలిపింది. యునైటెడ్ ఇన్ సైన్స్ రిపోర్ట్ క్లబ్లో ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాతావరణ సంస్థ సహా వివిధ అంతర్జాతీయ సంస్థల నిపుణులు ఉన్నారు. ఈ అధ్యయనం ప్రపంచంలోని పలు ముఖ్యమైన వాతావరణ పర్యవేక్షణ కేంద్రాల నుంచి డేటాను సేకరించి నివేదికను తయారు చేసింది. హవాయిలోని మౌనాలోవా అబ్జర్వేటరీ వద్ద సేకరించిన గాలి నమూనాలో కార్బన్డయాక్సైడ్ మొత్తం 2019-జులైలో 411 పీపీఎమ్లుగా ఉండగా.. ఈ ఏడాది జూలైలో 414 పీపీఎమ్లకు పెరిగినట్టు అధ్యయనంలో గుర్తించారు. టాస్మానియాలోని కేప్గ్రిమ్ పర్యవేక్షణ స్టేషన్ వద్ద 407 పీపీఎమ్ల నుంచి 410 పీపీఎమ్లకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే విధంగా లేకపోయినప్పటికీ.. ప్రస్తుతమున్న డేటా ప్రకారం.. గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత పెరుగుదలతో పాటు భూతాపం పెరుగుతూనే ఉన్నదని స్పష్టం చేసింది. భూతాపం పెరుగుదల ఇదేవిధంగా కొనసాగితే అనేక జీవజాతులు ప్రమాదంలో పడతాయని హెచ్చరిస్తూ..ఆందోళన వ్యక్త చేసింది. భూతాపాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను నొక్కి చెప్పింది. భూతాపం పెరుగుదల కారణంగా ఇప్పటికే సముద్రమట్టం పెరుగుదల రేటులో వేగం పెరిగింది. 2016-2020 మధ్య కాలంలో పెరుగుదల రేటు ఏడాదికి 4.8 మిల్లీమీటర్లు కాగా, 2011-2015 మధ్య కాలంలో ఇది 4.1గా నమోదైంది. ఆర్కిటిక్ మంచు క్షీణత సైతం ఆందోళనకరంగా ఉంది. ఈ దశాబ్దంలో 13 శాతం క్షీణత నమోదైంది. దీనిపై ప్రపంచ వాతావరణ సంస్థ సెక్రెటరీ జనరల్, ప్రొఫెసర్ పెటేరి తాలాస్ మాట్లాడుతూ.. 'గత 3 మిలియన్ల ఏండ్లల్లో ప్రస్తుతం గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదటి భాగంలోనే సైబీరియా ప్రాంతాల్లో తీవ్రమైన వేడి గాలులు వీస్తున్నాయనీ, భూతాపం సైతం పెరుగుతున్నదని' అన్నారు.