Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్రిక్తతలను పరిష్కరించుకునేందుకు చైనా-భారత్ మధ్య ఒప్పందం
- తాజా పరిస్థితులు ఇరు దేశాలకూ మంచిది కాదని వ్యాఖ్య
మాస్కో : కొద్దిరోజులుగా సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య తలెత్తిన వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించు కోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే అది రెండు దేశాలకూ మంచిది కాదని ఏకాభిప్రాయానికి వచ్చాయి. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పి.. యథాతథ స్థితికి చేరుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకు న్నాయి. ఇందుకు గానూ ఉభయదేశాలు ఐదు అంశాల ప్రణాళికను పటిష్టంగా అమలుచేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశాలు దీనికి వేదికయ్యాయి.
భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్యీతో సమావేశమైన సందర్భంగా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై దాదాపు రెండుగంటలకు పైగా చర్చించారు. సుమారు నాలుగు నెలలుగా వాస్తవాధీనరేఖ (ఎల్ఎసీ) వద్ద తూర్పు లఢక్లో చైనా బలగాలు మొహరింపు, సైనికుల ఘర్షణలు, పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దురాక్రమణపై జైశంకర్.. వాంగ్యీ వద్ద అభ్యంతరాలు లేవనెత్తినట్టు తెలుస్తున్నది. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా సరిహద్దు వ్యవహారాలపై 1993, 1996లో తీసుకున్న నిర్ణయాలకు (మొదటిపేజీ తరువాయి)
కట్టుబడి ఉండాలని ఆయన సూచించినట్టు సమాచారం.
ఐదు అంశాల ప్రణాళిక
1. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను పటిష్టం చేసుకోవాలి. విబేధాలు వివాదాలుగా మారకుండా ఉభయ వర్గాలూ చొరవ చూపాలి.
2. ప్రస్తుతం తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ఎవరికీ ప్రయోజనం చేకూర్చవు. కావున ఇరు వర్గాల సరిహద్దు దళాలు చర్చలు కొనసాగించాలి. తక్షణమే బలాల ఉపసంహరణ చేపట్టాలి. ఎల్ఎసీ వద్ద సమాన దూరం పాటించాలి. తద్వారా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలి.
3. రెండు దేశాల సరిహద్దుల వ్యవహారాల్లో ఇప్పటికే కుదిరిన పలు ఒప్పందాలు, ప్రోటోకాల్స్ను పాటిస్తూ.. శాంతి స్థాపనకు కృషి చేయాలి. ఉద్రిక్తతలు పెంచే చర్యలకు పాల్పడొద్దు.
4. సరిహద్దు వివాదాల్ని ప్రత్యేక ప్రతినిధుల బృందం యంత్రాంగం ద్వారా పరిష్కరించుకోవాలి. ఆ దిశగా ఇప్పటికే ఏర్పడ్డ 'వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కో ఆర్డినేషన్ ఆన్ ఇండియా-చైనా బోర్డర్ అఫైర్స్' కమిటీ సమావేశాలు కొనసాగించాలి.
5. ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత రెండు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించే దిశగా నిర్మాణాత్మక చర్యల్ని వేగవంతం చేయాలి.