Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరాన్ : ఇరాన్ ఛాంపియన్ రెజ్లర్ నవీద్ అఫ్కారీని శనివారం ఉదయం ఉరి తీశారు. 2018లో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల సమయంలో ఓ సెక్యూరిటీ గార్డును కత్తితో పొడిచి చంపాడన్న ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు అతనికి ఈ ఉరిశిక్షను విధించింది. అయితే నవీద్పై ఆరోపణలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పూర్తిగా ఖండించింది. ఇదిలా ఉండగా, నవీద్ ఉరితీతకు ముందు అతని ఆడియో టేపు ఒకటి బయటికి వచ్చింది. ''నాకు మరణశిక్ష అమలు చేస్తే మీకో విషయం తెలియజేయాలనుకుంటున్నాను. స్వశక్తిపై పోరాటం చేయాలనుకుంటున్న వ్యక్తి ప్రాణాలు తీశారు'' అని ఉంది. నవీద్ను చివరిసారిగా చూసేందుకు అతని కుటుంబసభ్యులకు కనీసం అవకాశం కూడా కల్పించలేదు. ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించింది. చేయని తప్పును ఒప్పుకునేలా అఫ్కారీని టార్చర్కు గురి చేశారంటూ అతని కుటుంబసభ్యులు, సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. మరోవైపు 85 వేల మంది క్రీడాకారులతో కూడిన ఒక గ్లోబల్ యూనియన్ గురువారం నాడు స్పందిస్తూ అఫ్కారీని ఉరితీస్తే క్రీడా ప్రపంచం నుంచి ఇరాన్ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. అతడిని అన్యాయంగా లక్ష్యంగా మార్చుకున్నారని ది వరల్డ్ ప్లేయర్స్ అసోసియేషన్ పేర్కొంది. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా నవీద్కు క్షమాభిక్ష ఇవ్వాలని కోరారు. నవీద్పై చర్య విచారకరమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా అఫ్కారీని ఉరి తీయవద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమం నడిచింది. ఈ పరిణామాల మధ్యే అఫ్కారీని ఉరితీశారు. అఫ్కారీని ఉరితీయడంతో క్రీడా ప్రపంచం మూగబోయింది.