Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లజాతీయుడి హత్యపై సర్వత్రా ఆందోళన
రోమ్ : నల్లజాతి యువకుడ్ని దారుణంగా కొట్టి చంపేసిన ఘటనపై ఇటలీలో నిరసనలు హోరెత్తుతున్నాయి. అధికార పార్టీలోని పలువురు మంత్రులు సైతం ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం జరిగిన అంత్యక్రియల్లో వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటలీలోని పలు నగరాల్లో ప్రజలు కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. తెల్లరంగు టీషర్టులు వేసుకొని, మాస్కులు ధరించి వేలాదిమంది ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా న్యాయం జరిగాలని డిమాండ్ చేశారు. యవకుడి మరణానికి కారణం జాతి వివక్షేనని స్థానిక మీడియా వార్తా కథనాలు ప్రసారం చేసింది. రోమ్ నగరం శివార్లలో ఈనెల 6న జరిగిన ఘర్షణలో 21ఏండ్ల నల్లజాతి యువకుడు మాంటేరియో డార్టేను కొంతమంది పదునైన ఆయుధాలతో దాడిచేసి చంపారు. స్థానికుల కథనం ప్రకారం, కొంతమంది శ్వేతజాతి యువకులు తన స్నేహితుడ్ని కొడుతుండగా డార్టే అడ్డుకున్నాడు. ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేశాడు. స్నేహితుడ్ని కొట్టొదని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడికి మరికొంత మంది శ్వేతజాతి యువకులు చేరుకొని దాడికి దిగారు. పదునైన ఆయుధాలతో దాడి చేయటంతో డార్టే అక్కడికక్కడే చనిపోయాడు. ఈ కేసులో పోలీసులు నలుగురు ఇటలీ పౌరులను అరెస్టు చేశారు. ఈ ఘటనను ఇటలీ ప్రధాని కాంటే తీవ్రంగా ఖండించారు. బాధితుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.