Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 మంది మృతి.. 400 మందికి పైగా గాయాలు
కొలంబియా : కస్టడీలో ఉన్న వ్యక్తిని కాల్చి చంపిన పోలీసుల తీరుపై కొలంబియా నిరసనలతో దద్దరిల్లింది. ఆ దేశరాజధాని బొగోతాతో పాటు దగ్గరలోని సవోచాలో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. బాధితుడికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున సాగిన ఈ నిరసనలపై పోలీసులు కాల్పులు జరపడంతో హింసాత్మకంగా మారాయి. బుధవారం నుంచి జరుగుతున్న నిరసనల్లో దాదాపు 13 మంది మృతి చెందారు. వీరిలో బుధవారం బొగోతోలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు, సవోచాలో ముగ్గురు చనిపోయారు. గురువారం మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క, 400 మందికి పైగా గాయాలపాలయ్యారు.జేవియర్ ఆర్డోనేజ్(46) అనే వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరపడంతో బాధితుడు బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనే ఆందోళనకారుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఆర్డోనేజ్కు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి, ఘర్షణలకు దారి తీసింది. దీంతో అది కాస్తా హింసాత్మకంగా మారి పోలీసుల కాల్పుల వరకు వెళ్లింది. కాగా, కరోనా నిబంధనలు ఉల్లంఘించి స్నేహితులతో కలిసి ఆర్డోనేజ్ మద్యం సేవిస్తున్నందునే ఈ చర్యకు ఉపక్రమించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఇద్దరు అధికారులతో పాటు మరో ఐదుగురు సిబ్బంది సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. తాము చట్టం ఉల్లంఘించినట్లయితే అందుకు క్షమాపణలు చెప్తున్నట్టు పోలీసులు తెలిపారని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కార్లోస్ హోల్మ్స్ శుక్రవారం తెలిపారు. పోలీసుల తరఫునా తాను కూడా క్షమాపణలు చెప్తున్నానని వెల్లడించారు.