Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెల్లింగ్టన్ : న్యూజీలాండ్లో అతిపెద్ద నగరమైన ఆక్లాండ్ను మినహాయించి దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో ఈ నెల 21నుంచి కరోనా వైరస్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు ప్రధాని జసిండా ఆర్డెర్న్ సోమవారం తెలిపారు. ఆక్లాండ్లో రెండోసారి కరోనా వైరస్ విజృంభించింది. అక్కడి ఆంక్షలను వచ్చే సోమవారం సమీక్షించనున్నట్లు తెలిపారు. విమానాల్లో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను తక్షణమే సడలించనున్నట్లు చెప్పారు. నెలల తరబడి విమానాల్లో ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేసిన ఎయిర్ న్యూజీలాండ్కు ఇది పెద్ద ఉపశమనం. ఈ చర్యల వల్ల పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతందన్నారు. అయితే ప్రభుత్వ రవాణా సాధనాల్లో ముఖానికి మాస్కులు తప్పనిసరని పేర్కొన్నారు. 50లక్షల జనాభా కలిగిన న్యూజీలాండ్ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో విజయం సాధించినట్లే కనిపించింది కానీ ఆగస్టులో ఆక్లాండ్లో తిరిగి కేసులు విజృంభించడంతో మళ్ళీ లాక్డౌన్ పెట్టాల్సి వచ్చింది. అక్టోబరు 17న న్యూజీలాండ్ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే సోమవారం సమీక్షించి అవసరమైతే ఆక్లాండ్ ఆంక్షల్లో మార్పులు తీసుకువస్తామని తెలిపారు. సోమవారానికి న్యూజీలాండ్లో 1447 కేసులు నమోదవగా, 24మంది మరణించారు.
ఇజ్రాయిల్లో రెండో దశ లాక్డౌన్
కరోనా కేసులు ఉధృతమవుతుండడంతో దేశవ్యాప్తంగా తిరిగి లాక్డౌన్ విధిస్తున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఆదివారం ప్రకటించారు. లాక్డౌన్లో భాగంగా పాఠశాలలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు రంగాలు మూతపడనున్నాయి. యూదులకు అతి ముఖ్యమైన ఈ సీజనులో సాధారణంగా ప్రార్ధనా మందిరాలు కిక్కిరిసి పోయి వుంటాయి. పైగా కుటుంబ సభ్యులందరూ ఒక్కచోటకు చేరి సరదాగా గడుపుతారు. దీంతో కరోనా ప్రభావం మరింత పెరుగుతుందనే భయంతో ముందు జాగ్రత్తగా లాక్డౌన్ విధిస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రతను నిలువరించడమే తమ లక్ష్యమని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల మనందరికీ కొంచెం కష్టమే, అయినా తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. మార్చిలో దీర్ఘకాలం లాక్డౌన్ తర్వాత రెండోసారి మళ్ళీ వైరస్ ప్రబలింది.