Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుధవారం పార్లమెంటరీ ఎన్నిక
టోక్యో : జపాన్ పాలక పార్టీ కొత్త అధినేతగా యోషిహిడే సుగా సోమవారం ఎన్నికయ్యారు. దీంతో దేశ తదుపరి ప్రధానిగా ఆయన పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది.గత నెలలో అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రధాని షింజో అబె ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు వారసుడిని ఎన్నుకునేందుకు జరిగిన పాలక లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ఎన్నికల్లో సుగాకు 377ఓట్లు లభించాయి. ఈ పదవికి పోటీ చేసిన మాజీ విదేశాంగ మంత్రి కిషిడాకు 89, మాజీ రక్షణ మంత్రి షిగెరు ఇషిబాకు 68ఓట్లు లభించాయి. ప్రస్తుతం అబె ప్రభుత్వంలో చీఫ్ కేబినెట్ కార్యదర్శిగా వున్న సుగా ఎన్నికను అందరూ ముందుగానే ఊహించారు. పాలక సంకీర్ణంలో లిబరల్ డెమొక్రాట్లకే మెజారిటీ వున్నందున బుధవారం జరిగే పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధానిగా ఆయన ఎన్నిక ఖరారైనట్లేనని భావించవచ్చు. ఆయన విజయం ముందుగా కుదిరిన ఒప్పందంలా కనిపిస్తుండడంతో పార్టీ లోపల, వెలుపల విమర్శలు ఎదురయ్యాయి. ఇది ప్రజాస్వామ్య క్రమం కాదని విమర్శించారు. జనాంతికంగా జరిగిన కొన్ని రాజకీయాలు కూడా సుగాకు మద్దతివ్వడానికి దోహదపడ్డాయి.