Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 35మంది మృతి, అనేక మంది అదృశ్యం
ఓరెగాన్ : కార్చిచ్చు అమెరికాలోని పలు ప్రాంతాలను కాల్చివేస్తోంది. కాలిఫోర్నియా నుండి వాషింగ్టన్ వరకు వ్యాపించిన ఈ దావానలంలో ఇప్పటివరకు 35మంది మరణించారు. దక్షిణ ఓరెగాన్లో మంటలు చెలరేగిన తర్వాత ఇప్పటివరకు డజన్ల సంఖ్యలో వ్యక్తులు ఆచూకీ తెలియకుండా పోయారని అధికారులు ఆదివారం తెలిపారు. పశ్చిమ తీర ప్రాంతంలో చెలరేగిన ఈ మంటలతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నాశనమయ్యాయి. తగలబడిన కార్లు, బూడిద కుప్పలు తప్ప అక్కడేమీ కనిపించడం లేదు. దీంతో వేలాదిమంది అక్కడ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళిపోయారు. సియాటెల్, శాన్ఫ్రాన్సిస్కో, పోర్ట్ల్యాండ్, ఓరెగాన్లలో దట్టమైన పొగ కారణంగా వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో వుంది. తీవ్రంగా లోహాలు కాలుతున్న వాసనలతో ఆ ప్రాంతాలన్నీ దారుణంగా మారాయి. ప్రజలకు శ్వాస తీసుకోవడమే కష్టంగా మారింది. అయితే తేమ తగ్గిపోవడం, బలమైన ఈదురు గాలులు మంటలకు ఆజ్యం పోస్తుండడంతో పరిస్థితి మరింత విషమంగా తయారైంది. బాగా దెబ్బతిన్న దక్షిణ ఓరెగాన్ నుండి ఉత్తర కాలిఫోర్నియా వరకు రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలు అమల్లో వున్నాయి. యాష్లాండ్ ప్రాంతంలో చెలరేగిన దావానలం తర్వాత దాదాపు 50మంది కనిపించడం లేదని అధికారులు గత వారమే తెలిపారు. ఓరెగాన్లో గత వారంలో 10మంది మరణించారు. పలు చోట్ల అడవుల్లో తలెత్తిన ఈ మంటల వల్ల అదృశ్యమైన వారి సంఖ్య, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు వున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలిఫోర్నియాలో 24మంది మరణించగా, వాషింగ్టన్లో ఒకరు చనిపోయారు. వేలాది ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంత స్థాయిలో మంటలు చెలరేగడం గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు పేర్కొంటున్నారు. నెవడాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ, అటవీ యంత్రాంగం నిర్వహణ సరిగా లేదని విమర్శించారు. భవనాలు పేకమేడల్లా కాలిపోతున్నాయని, వృక్షాలు కొవ్వొత్తులా నిట్టనిలువునా మండిపోతున్నాయని గత ఆరు రోజులుగా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తిరుగుతున్న అగ్నిమాపక సిబ్బంది ఒకరు స్టీవ్ మెకడో వ్యాఖ్యానించారు.