Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్కు పెరుగుతున్న ప్రాధాన్యత
- 66శాతం మంది బిడెన్ వైపు,28శాతం ట్రంప్ వైపు: సర్వేలో వెల్లడి
వాషింగ్టన్ : ఇండియన్ అమెరికన్స్లో మెజారిటీ సభ్యులు డెమోక్రటిక్ అభ్యర్ధి జో బిడెన్కే ఓటు వేస్తారని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రవాస భారతీయుల సంస్థ, డేటా సేకరించే సంస్థ ఎఎపిఐ డేటాలు నిర్వహించిన ఈ సర్వేలో 66శాతం మంది ఇండియన్ అమెరికన్స్ బిడెన్కు అనుకూలంగా వున్నారని వెల్లడైంది. మంగళవారం ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేశారు. 28శాతం మంది ట్రంప్కు అనుకూలంగా వుండగా, 6శాతం మంది ప్రజలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ ఓట్లలో మెజారిటీ ఓట్లు బిడెన్కు వచ్చినా డెమోక్రటిక్ సభ్యుల సంఖ్య 2016 కన్నా తక్కువగానే వుంటుంది. గత ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్ 77శాతం మంది హిల్లరీ క్లింటన్కు వేశారు, కేవలం 16శాతం మందే ట్రంప్కు ఓటు వేశారు. అయితే, 2016 ప్రీ ఎన్నికల్లో క్లింటన్కు ఓటు వేశామని 67శాతం మంది ఇండియన్ అమెరికన్స్ చెబుతున్నారు. 2012లో మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామాను 80శాతం మందికి పైగా ప్రజలు మద్దతిచ్చారు. ఇండియన్ అమెరికన్స్లో 54శాతం మందిని డెమోక్రాట్లుగా గుర్తించారు. 16శాతం మంది రిపబ్లికన్లుగా, 24శాతం మంది ఇండిపెండెంట్లుగా గుర్తించారని నివేదిక పేర్కొంది. ఏఏపీఐ డేటా 2020 ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వేలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. రాబోయే ఎన్నికల్లో తాము ఓటు వేస్తామని 98శాతం మంది ఇండియన్ అమెరికన్స్ చెప్పగా, ఈ ఏడాది ప్రైమరీల్లో ఓటు వేసామని 54శాతం మంది చెప్పారు. ఇండియన్ అమెరికన్ ఓటర్లను ఆకర్షించేలా అటు డెమోక్రటిక్, ఇటు రిపబ్లికన్ పార్టీలు ప్రచారాలు చేపట్టారు. ముఖ్యంగా కీలక రాష్ట్రాలుగా భావించే పెన్సిల్వేనియా, మిచిగన్, జార్జియా, ఉత్తర కరోలినా, ఫ్లోరిడా, టెక్సాస్, అరిజోనాల్లో ఈ ప్రచారం బాగా సాగింది. ప్రతి ఒక్క ఓటు కీలకమైనది అయినందున ఇండియన్ అమెరికన్స్ అందరినీ బాగా కలుపుకుని పోయేలా, వారికి చేరేలా డెమోక్రాట్లు ప్రచారం చేశారని భావిస్తున్నట్లు ఇల్లినాయిస్కి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. 2020 ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ 56శాతం మంది ఇండియన్ అమెరికన్స్ను కలుసుకుని ప్రచారం నిర్వహించగా, రిపబ్లికన్ పార్టీ 48శాతం మందిని కలుసుకుంది.
2016లో ఏ పార్టీకి చెందిననదైనా ఈ సంఖ్య కేవలం 31శాతంగానే వుంది. ఇక డెమోక్రాట్ల విషయానికొస్తే కమలా హారిస్ భారతీయ మూలాలు ప్రచారంలో ప్రత్యేక ప్రస్తావనగా వుంటూ వస్తోంది. మొత్తమ్మీద ఇండియన్ అమెరికన్స్కు దగ్గరవడం ఎంత కీలకమైన విషయమో ప్రధాన పార్టీలు రెండూ కూడా గుర్తించడం ప్రారంభించడం ఇక్కడ సంతోషించదగ్గ పరిణామమని ఇండియాస్పోరా వ్యవస్థాకుడు ఎం.ఆర్.రంగస్వామి వ్యాఖ్యానించారు. కాలం గడుస్తున్న కొద్దీ తమ ప్రభావం పెరుగుతోందన్నారు. ఇండియన్ అమెరికన్ ఓటర్లకు పలు దేశీయ సమస్యల ముందు విదేశాంగ విధానం పెద్దగా లెక్కలోకి రావడం లేదని ఈ వారం సర్వేలో వెల్లడైంది. ఆసియా దేశాల పట్ల అమెరికా విదేశాంగ విధానం ఎలా వుండబోతుందనే దానికి వారు చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.