Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో పెరిగిన అసమానతలు
- ప్రపంచబ్యాంక్ నివేదిక విడుదల
వాషింగ్టన్ : ప్రపంచబ్యాంక్ తాజా వార్షిక మానవ వికాస సూచీలో భారత్ 116వ స్థానంలో నిలిచింది. మొత్తం 174 దేశాల్లో భారత్కు నిరాశజనకమైన స్థానం దక్కింది. దేశాలవారీగా ప్రజల స్థితిగతులను, అభివృద్దిని వివరించే ఈ సూచీని బుధవారం ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. 2020 సంవత్సరానికి విడుదల చేసిన ఈ మానవ సూచీలో 174 దేశాల అంటే 98శాతం ప్రపంచ జనాభా ఆరోగ్య, విద్యకు సంబంధించి మార్చి వరకు డేటా వుంది. అంటే కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పూర్తి స్థాయిలో కబళించకముందున్న తరుణంలో పిల్లల వికాసం, ఆరోగ్య, విద్య సమాచారాన్ని తెలియచేస్తుంది. ఈ నివేదికను విశ్లేషించినట్లైతే, కరోనాకు ముందు చాలా దేశాలు మానవ సూచీ విషయంలో నిలకడైన పురోగతి సాధించాయని తెలుస్తోంది. తక్కువ ఆదాయాలు కలిగిన దేశాల్లో కూడా మెరుగైన పరిస్థితి నెలకొంది. ఇంత పురోగతి సాధించినా, కరోనాకు ముందు కూడా, ఒక సాధారణ దేశంలో జన్మించిన బిడ్డ పూర్తి విద్య, ఆరోగ్య సాధనలో 56శాతాన్ని మాత్రమే సాధించగలుగుతారని భావిస్తున్నట్లు బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. తాజాగా తలెత్తిన కరోనా ప్రభావంతో ఆరోగ్యం, ఆయు ప్రమాణాలు, స్కూల్లో చేరడం, తగ్గిన పెరుగుల వంటి విషయాల్లో దశాబ్దాలుగా సాధించిన పురోగతి ప్రమాదంలో పడింది. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక ప్రభావాలు ముఖ్యంగా మహిళలు, పిల్లలపై ఎక్కువగా వుందని నివేదిక పేర్కొంది. సమాజంలోని పీడిత వర్గాల వారు ఆహార అభద్రతకు, దారిద్య్రానికి గురవుతున్నారని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్మాల్పాస్ వ్యాఖ్యానించారు. నిలకడగల, సర్వపరివ్యాపితమైన అభివృద్ధికి పునాది వేయాలంటే ప్రజలను రక్షించడం, వారిపై పెట్టుబడి పెట్టడం చాలా కీలకమని అన్నారు. కరోనా కారణంగా వంద కోట్లకు పైగా చిన్నారులు పాఠశాలకు దూరమయ్యారని పేర్కొంది. అలాగే మహిళలు, పిల్లల అత్యవసరమైన ఆరోగ్య సేవలకు గణనీయంగా అంతరాయం కలిగిందని తెలిపింది. అనేకమంది పిల్లలకు కీలకమైన వ్యాక్సిన్లు అందకుండా పోయాయని పేర్కొంది. ఈ మానవ వికాస సూచీపై గతేడాది భారత్ తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆనాడు 157 దేశాల్లో భారత్ది 115వ స్థానం. ఈసారి 174దేశాల్లో భారత్ది 116వ స్థానం. ఈ సూచీని మెరుగదల చర్యలకు ఒక మార్గంగా ఉపయోగించడానికి తాము కృషి చేస్తామని బ్యాంక్ మానవాభివృద్ధి విభాగ ఆర్థిక నిపుణురాలు రాబెర్టా గెట్టి పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తన ప్రాధాన్యతలను తెలుసుకోవడానికి ఈ సూచీ ఒక ప్రాతిపదికగా పనిచేస్తుందని అన్నారు. కరోనా కాలంలో ఈ నివేదికకు ప్రాధాన్యత పెరిగింది. నిరుపేదల జీవన భృతికి తోడ్పాటునివ్వడంలో బ్యాంక్ భారత అధికారులతో కలిసి పనిచేస్తుందన్నారు. ఇది చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అసమానతలను పెంచిందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ వ్యాఖ్యానించారు. దీనికి తోడు దారిద్య్రం, ఒత్తిడి, కుంగుబాటు కూడా పెరిగాయన్నారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజలను కాపాడేందుకు దేశాలతోకలిసి పనిచేస్తున్నామని చెప్పారు..