Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది పేదరికంలోకి... 15 కోట్లమంది బాలలు
- కరోనా వల్ల విద్య, వైద్యం, పౌష్టికాహారానికి దూరం..
- పేదరికాన్ని 15శాతం పెంచిన సంక్షోభం
- అణగారిన వర్గాల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి : యూనిసెఫ్
ఐక్యరాజ్యసమితి : కోవిడ్-19 సంక్షోభం కారణంగా ప్ర్రపంచవ్యాప్తంగా 15కోట్లమంది బాలలు పేదరికంలోకి కూరుకుపోయారని ఐక్యరాజ్యసమితి బాలల విభాగం 'యూనిసెఫ్' వెల్లడించింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వివిధ స్థాయిలో పేదరికాన్ని ఎదుర్కొంటున్న బాలల సంఖ్య 120కోట్లకు పెరిగిందని 'యూనిసెఫ్' తెలిపింది. బాలల హక్కుల గ్రూపులు, సేవ్ ద చిల్డ్రన్, యూనిసెఫ్ సంయుక్తంగా జరిపిన తాజా అధ్యయనంలో పై విషయాలు వెల్లడయ్యాయి. విద్య, ఆరోగ్యం, గూడు, పౌష్టికాహారం, మరుగుదొడ్లు, నీటి వసతి...మొదలైన అంశాలకు దూరమైన బాలల సమాచారాన్ని యూనిసెఫ్ సేకరించింది. కరోనా సంక్షోభం వల్ల బాలల పేదరికం 15శాతం పెరిగిందని అధ్యయనం తెలిపింది. దీంట్లో పేర్కొన్న మరికొన్ని విషయాలు ఇలా ఉన్నాయి.
పేదరిక సమస్యను పెంచిన లాక్డౌన్
70దేశాల్లో బాలల సమాచారాన్ని సేకరించి ఈ నివేదికను విడుదల చేశారు. 15కోట్లమంది బాలల్లో 45శాతం కరోనా మహ్మమారి ప్రబలడానికి ముందే పేదరికంలోకి వెళ్లిపోయారు. బాలల సంక్షేమంపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే...ముందు ముందు పరిస్థితులు మరింతగా దిగజారుతాయని యూనిసెఫ్ హెచ్చరించింది. ప్రభుత్వాలకు తగిన సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సేవ్ ద చిల్డ్రన్, యునిసెఫ్ ప్రకటించాయి. పేదరికం సమస్యతో బాధపడటమేకాదు, అనేక దేశాల్లో బాలలు తీవ్రమైన పేదరికంలో కూరుకుపోవటం తమ దృష్టికి వచ్చిందని అధ్యయనం తెలిపింది. కోవిడ్-19 వైరస్, లాక్డౌన్ విధింపు వివిధ దేశాల్లో సమస్య పెరగడానికి కారణమైందని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రీట్టా ఫొరె అన్నారు.
సంక్షేమం ఒక్కటే దారి..
సమీకృత ద్రవ్య విధానం, సామాజిక రక్షణ, సేవారంగంల్లో ప్రభుత్వ పెట్టుబడులు, ఉపాధి, కార్మికరంగాల్లో కుటుంబాలకు మద్దతు...వంటి చర్యలతో బాలల పేదరికాన్ని తగ్గించవచ్చని యూనిసెఫ్ పేర్కొన్నది. రిమోట్ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వారికి విద్య, వైద్యం అందేట్టు చూడాలని సూచించింది. అణగారిన వర్గాల్లో బాలలు ఈ కోవిడ్-19 కారణంగా విద్యకు దూరమయ్యారని 'సేవ్ ద చిల్డ్రన్' సీఈఓ ఇంగర్ ఆషింగ్ చెప్పారు. విద్యకు దూరమవటంతో వారిని మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయని ఆమె అన్నారు. బాల కార్మికుల సంఖ్య పెరగడానికి దారితీస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ సమస్యపై దృష్టిసారించాలని అభిప్రాయపడ్డారు.