Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సవాళ్ళ పరిష్కారానికి అంతర్జాతీయ సహకారం బలోపేతం
- ఐరాస వార్షికోత్సవాల సందర్భంగా ప్రపంచ నేతల పిలుపు
బీజింగ్ : బహుళవాదమే ఇక మన లక్ష్యం కావాలని ప్రపంచ నేతలు నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారం బలోపేతం కావాలన్నారు. ఐక్య రాజ్య సమితి 75వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో నేతలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మంగళవారం మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కేంద్రంగా బహుముఖ వాణిజ్య వ్యవస్థను పరిరక్షించుకోవాలని దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అరమరికలు లేకుండా, పారదర్శకంగా వ్యవహరిస్తూ, సర్వపరివ్యాపిత అభివృద్ధి కోసం పాటుపడుతూ, అవరోధాలు లేని బహిరంగ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి దేశాలన్నీ చేతులు కలపాలని కోరారు. ఏకపక్షవాదానికి, రక్షణవాదానికి ఇక స్వస్తి పలకాలన్నారు. అంతర్జాతీయ పారిశ్రామిక, సరఫరా చెయిన్ల పనితీరు స్థిరంగా వుండేలా, సాఫీగా సాగేలా మనం కృషి చేయాలన్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐరాస వ్యవస్థాపక దినోత్సవాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ వైద్య రంగ సహకారానికి గల అడ్డంకులను తొలగించాలని కోరారు. ఆర్థిక వ్యవస్థ సంరక్షణ మాదిరిగానే ఆరోగ్య సంరక్షణకు కూడా మనం సాధ్యమైనంత రీతిలో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలని, అడ్డంకులను, అవరోధాలను తొలగించుకోవాలని పిలుపిచ్చారు. బహుముఖ, ద్వైపాక్షిక సంబంధాల్లో మానవతావాదం పాత్రను పెంపొందించడం వల్ల అంటే రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, యువత పరస్పర మార్పిడులు, సాంస్కృతిక సంబంధాలు, సామాజిక, విద్యా కార్యక్రమాలు, క్రీడలు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారం, పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ వంటి రంగాల్లో ఈ చర్యలు పెరగడం వల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర, పేరుప్రతిష్టలు మరింత బలోపేతమవుతాయని పుతిన్ పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ మాట్లాడుతూ, మరింత పారదర్శకమైన, సంతుల, సమానత్వంతో కూడిన, నిలకడగల ప్రపంచీకరణకు మనందరం కలిసి పునాదులు వేయాలని కోరారు. బహుళవాదమే ఇక మన లక్ష్యం కావాలన్నారు. ఇది కేవలం ఒక విశ్వాస చర్య మాత్రమే కాదని, ఇదొక అవసరమని, అనివార్యమని ఆయన వ్యాఖ్యానించారు. చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా మాట్లాడుతూ, అంతర్జాతీయ సహకారం, పాలనను పటిష్టపరుచుకోవాల్సిన ఆవశక్యతను కరోనా సంక్షోభం మనకు తెలియచేసిందన్నారు. పరస్పర సహకారం, బహుముఖ పరిష్కారాల ద్వారా మాత్రమే ఈ సంక్షోభాలను అధిగమించగలమని అన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ మాట్లాడుతూ, ఈ అనుసంథానత ప్రపంచంలో ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సంఘీభావం అనేది స్వ ప్రయోజనాలకే, ఆ వాస్తవాన్ని మనం గుర్తించకపోతే, ప్రతి ఒక్కరూ నష్టపోతారని అన్నారు. ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి అధ్యక్షుడు మునీర్ అక్రమ్ మాట్లాడుతూ, మనం ప్రస్తుతం మూడు సవాళ్ళను ఎదుర్కొంటున్నామన్నారు. కరోనా నుండి కోలుకోవడం, నిలకడైన అభివృద్ధి లక్ష్యాలను సాకారం చేసుకోవడం, పర్యావరణ విపత్తులను నివారించగలగడం ఈ మూడింటిని సమర్ధవంతంగా ఎదుర్కొనాల్సి వుందన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో అంతర్జాతీయ సహకారం అనేది చాలా అవసరమైందని ఆయన వ్యాఖ్యానించారు.