Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్క్ ఫ్రమ్ హౌం ఉద్యోగులపై పెరుగుతున్న నిఘా
- ట్రాకింగ్ సాఫ్ట్వేర్లతో మరింత ప్రమాదం
- కోవిడ్ కాలంలో మూడింతలైన ఈ తరహా సాఫ్ట్వేర్ల అమ్మకాలు
- బూజుపడుతున్న ఐటీ చట్టాలు
న్యూయార్క్ : ప్రపంచ మహమ్మారి కరోనా కారణంగా చాలా వరకు ఐటీ, ఇతర రంగాలలోని సంస్థలు వారి ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడానికి మొగ్గు చూపుతున్నాయి. దీనిద్వారా ఆయా సంస్థలకు కార్యాలయ నిర్వహణ ఖర్చులు మిగలడమే గాక ఉత్పత్తిని కూడా పెంచుకుంటున్నాయి.
అయితే కరోనా వైరస్ భయం వల్లో, మరే ఇతర కారణాల వల్లో ఐటీ రంగంలో చాలామంది ఇంటి నుంచే పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నా.. దానివల్ల కలిగే దుష్పరిణామాలకూ బాధితులవుతున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హౌమ్ చేసే ఉద్యోగుల మీద కంపెనీలు నిఘా పెడుతున్నాయి. ఉద్యోగులకు తెలిసో, తెలియకో ట్రాకింగ్ సాఫ్ట్వేర్లు వారి ల్యాప్ట్యాప్, డెస్క్టాప్, స్మార్ట్ ఫోన్ లలో ఇన్స్టాల్ అయిపోయి.. పొద్దున్నుంచి రాత్రి దాకా వాళ్లేం చేస్తున్నారనేదానిమీద ఓ కన్నేసి ఉంచుతున్నాయి. కొన్ని సంస్థలైతే వీడియో ట్రాకింగ్ సాఫ్ట్వేర్ల ద్వారా ఉద్యోగులు చేస్తున్న పనిని వారి ల్యాప్ట్యాప్ల ఆధారంగానే పసిగడుతుండటం మరింత ఆందోళనకరంగా మారింది.
ఒక నివేదిక ప్రకారం.. యూఎస్లో 42 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వారంతా ఇంట్లో కిచెన్లో పనిచేస్తూనో, లివింగ్ రూముల్లోనో, ప్రత్యేక గదులలోనో ఆఫీసు పనులు కానిచ్చేస్తున్నారు. అయితే వారికి తెలియకుండా ఉద్యోగుల స్మార్ట్ఫోన్లు, ల్యాప్ట్యాప్లలో ఇన్స్టాల్ అయి ఉన్న ట్రాకింగ్ మాల్వేర్స్.. వారి దినచర్యను మొత్తం బాస్ల ముందుంచుతున్నాయి. 'హబ్స్టాఫ్' అనే ట్రాకర్.. ఉద్యోగులు ల్యాప్ట్యాప్ మీద చేస్తున్న ప్రతి పనిని పసిగడుతుంది. ఉద్యోగి వాడుతున్న మౌస్, కీబోర్డు, ఈమెయిల్, వెతుకుతున్న వెబ్సైట్లు, పంపిస్తున్న ఫైల్స్... ప్రతీదీ తన బాస్ మూడో కన్ను పరిధి దాటి వెళ్లదు. ''టైమ్ డాక్టర్'' అనే మరో ట్రాకర్.. ల్యాప్ వెబ్క్యామ్ ద్వారా వీడియోలు రికార్డు చేస్తుంది. ఇందులో ప్రతి పదినిమిషాలకొకసారి వీడియో రికార్డవుతుంది. ఒకవేళ ఉద్యోగి ఏదైనా పనిమీదో లేక బాత్ రూంకో వెళ్లి రెండు నిమిషాలు ల్యాప్మీద లేకున్నా.. అతడుఆమె తిరిగిరాగానే ''మీరు రెండు నిమిషాలు పనిచేయలేదు.. తిరిగి ప్రారంభించండి'' అని పాపప్ (మెసేజ్ వంటిది) వస్తుంది.
మరికొన్ని సాఫ్ట్వేర్లయితే ల్యాప్ స్క్రీన్ ద్వారా.. దాని ముందు కూర్చున్న వ్యక్తి ఏం చేస్తున్నాడనేది రికార్డు చేసి కంపెనీ యాజమాన్యానికి పంపిస్తున్నాయి. ఇక ''ఇంటర్ గార్డ్'' అనే సాఫ్ట్వేర్.. ప్రతి నిమిషానికి ఉద్యోగి వాడుతున్న యాప్, చేస్తున్న పనిని సమీక్షించి.. ''ఇతడు పని చేస్తున్నాడా లేదా..? ఇతడి నుంచి ఉత్పాదకత వస్తున్నదా.. లేదా..?'' అనే విషయాన్ని సంస్థ యాజమాన్యానికి చేరవేస్తున్నాయని 'ది వాషింగ్టన్ పోస్టు' ఒక కథనంలో వెలువరించింది.
రిమెట్ వర్క్ ఫోర్స్ ఇక సాధారణమేనా..?
కోవిడ్ సంక్షోభంతో ఆఫీసుల పని సంస్కతి పూర్తిగా మారిపోయింది. అంతకుముందు అప్పుడో ఇప్పుడో ఉన్న ఇంటి నుంచే పని చేసే విధానాన్ని.. ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలు అనుసరిస్తున్నాయి. ఇకనుంచి చాలాసంస్థలు సాంప్రదాయ పనివిధానాని (ఆఫీసుకు రావడం, పనిచేయడం వంటివి) కి గుడ్బై చెప్పేసి.. ఇంటి నుంచే పనిచేసే దానికే ఓటువేస్తున్నాయి. కొత్త రిక్రూట్మెంట్లు కూడా ఇదే విధానంలో నడుస్తున్నాయి. గార్ట్నర్.ఐఎన్సీ సర్వేలో వెల్లడించిన విషయాల మేరకు.. 74 శాతం కంపెనీలు కొత్తగా నియమించుకునే, ఇప్పటికే ఉన్న 20 శాతం ఉద్యోగులకు ఇంటి నుంచే పని కల్పించే (పర్మినెంట్ రిమోట్ వర్క్ ఫోర్స్) విధానానికి జై కొట్టాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే 2 లక్షల మంది ఉద్యోగులు 2021 దాకా ఇంటినుంచే పనిచేయాలని గూగుల్ ప్రకటించింది. ఇక తన ఉద్యోగుల్లో 50 శాతం మందికి ఈ దశాబ్దం పూర్తయ్యేదాక వర్క్ ఫ్రమ్ హౌం ఇస్తున్నట్టు ఫేస్బుక్ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాల్సెంటర్ సంస్థగా పేరున్న టెలిపర్ఫామెన్స్.. ప్రపంచవ్యాప్తంగా తనకున్న ఉద్యోగులలో సగం మంది (దాదాపు లక్షన్నర)ని ఆఫీసులకు రాకుండానే పనిచేయాలని ఆదేశించింది.
అయితే ఈ విధానాలన్నీ ఆందోళనకరమని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయడం ప్రస్తుతానికి బాగానే ఉన్నా.. తర్వాత తీవ్ర ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయని అంటున్నారు. ఉద్యోగితో మరో ఉద్యోగి సంబంధం లేకుండా చేస్తున్నారనీ, సహౌద్యోగి గురించి తెలుసుకుంటే వారిపై నిఘా పెట్టి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారని ఈ అంశంపై అధ్యయనం చేస్తున్న స్టాన్ఫోర్డ్ లో ఆర్థికవేత్తగా పనిచేస్తున్న నికోలస్ బూమ్ తెలిపారు.
ఇది అసమానత్వాన్ని కూడా పెంపొందించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఉద్యోగ అనిశ్చితి ఉంటుందనీ.. నైపుణ్యాలు, పనిఅనుభవం క్షీణిస్తే వారిని ఉద్యోగాల్లోంచి తీసేసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. అంతేగాక ఇంటి దగ్గర నుంచి పనిచేయడం అన్నివేళలా శ్రేయస్కరం కాదనీ.. వారికి మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. దీనిపై కార్మిక సంఘాలు, న్యాయనిపుణులు పోరాడి శ్రామికలోకానికి విముక్తి కలిగించాలని ఆయన సూచించారు.
చట్టాలున్నా లేనట్టే...
ఒకవైపు ఉద్యోగులపై నిఘా నేత్రాలు పెరుగుతుంటే.. వారిని ఆదుకోవాల్సిన చట్టాలు మాత్రం కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు చుట్టాలుగా మారాయి. అమెరికాలో ఆన్లైన్ నిఘా అనేది ఇప్పుడు అనధికారిక చట్టంగా మారింది. సాధారణంగా అక్కడ ఒక యజమాని.. ఉద్యోగి సిస్టమ్ను ట్రాక్ చేస్తున్న విషయాన్ని అతడుఆమెకు తెలియజేయాలి. ఆఫీసులో పనిచేస్తే ఎలాంటి ట్రాకింగ్లూ ఉండవు. ఉద్యోగుల పర్యవేక్షణంతా వారి బాస్లకు తెలిసిపోతుంది. కానీ వర్క్ ఫ్రమ్ హౌం అలా కాదు. ప్రపంచాన్ని శాసిస్తున్నానని చెప్పుకుంటున్న అమెరికాలోనూ ఇప్పటికీ 1986లో రూపొందించిన ఎలక్ట్రానిక్స్ ప్రయివసీ యాక్టే అమల్లో ఉంది. అప్పటికీ డెస్క్టాప్ కంప్యూటర్లు మాత్రమే అందుబాటులో ఉండగా.. మొబైల్ హ్యాండ్సెట్ల ఊసే లేదు. అయితే పాత చట్టాలను మార్చాలని కొన్నాళ్లుగా యూఎస్లోని కార్మిక యూనియన్లు డిమాండ్ చేస్తున్నా.. పాలకుల నుంచి ప్రతిస్పందన కరువైంది. లేబర్ ఫ్రెండ్లీ మీడియా కూడా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో కార్పొరేట్లది ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది.
మూడింతలు పెరిగిన ట్రాకింగ్ సాఫ్ట్వేర్ల అమ్మకాలు
కోవిడ్ కాలంలో నిఘా సాఫ్ట్వేర్ల అమ్మకాలు మూడింతలు పెరిగాయి. ఈ ఏడునెలల కాలంలో తమ అమ్మకాలు పెరిగాయని హబ్స్టాఫ్, టెరామైండ్ వంటి సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఎంప్లాయిమెంట్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ ఇన్ యూఎస్ఎ వెబ్సైట్ కథనం ప్రకారం.. దాదాపు 70 ట్రాకింగ్ సాఫ్ట్వేర్ సంస్థల ఉత్పత్తుల అమ్మకాలు రెట్టింపయ్యాయి.