Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాల రూపంలో నష్టపోయింది రూ.25.86 లక్షల కోట్లు
- 17.3శాతం తగ్గిన పని గంటలు: ఐరాస
జెనీవా : కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలను బలికొంటూ వణికిస్తున్నది. అంతేకాదు, మహమ్మారి.. అనేక దేశాల్లో లక్షల సంఖ్యల్లో ఉద్యోగాలకు ఎసరుపెట్టింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులను కోవిడ్ మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కోట్లాది మంది కార్మికులు కరోనా తెచ్చిన కష్టనష్టాలను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎదుర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి పనులు లేక ఆర్థిక సమస్యలతో తీవ్రంగా సతమతమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు వేతనాల రూపంలోనే దాదాపు రూ.25.86 లక్షల కోట్లను(3.5 ట్రిలియన్ డాలర్లు) నష్టపోయారు. అలాగే కోట్లాది మంది కార్మికులు ఉపాధిని కోల్పోయి ఆదాయం లేక గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు సంబంధించిన అధ్యయనంంలో ఇది తేలింది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికలలో కార్మికులకు సంబంధించిన అంశాలపై ఆసక్తికర విషయాలను ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం.. గతంతో పోల్చుకుంటే ప్రపంచ పని గంటలు 17.3శాతం తగ్గాయి. ఈ పని గంటల మొత్తం దాదాపు 50 కోట్ల పుల్ టైం ఉద్యోగాలకు సమానం కావడం గమనించాల్సిన అంశం. అయితే ఈ ఏడాది జూన్లో ఐఐల్ఓ అంచనా వేసిన దాని కంటే ఇది అధికం కావడం గమనార్హం. ఈ ఏడాది రెండో త్రైమాసికం ముగింపు నాటికి ప్రపంచవ్యాప్తంగా పని గంటలు 14శాతం తగ్గే అవకాశం ఉన్నదని ఐఎల్ఓ అంచనా వేసింది. కాగా, ఇది ఒక విపత్తు అని ఐఎల్ఓ చీఫ్ గరు రైడర్ అన్నారు. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఆదాయం 10.7 శాతం తగ్గిందని తెలిపారు. కార్మికులు వేతనాల్లో నష్టపోయిన రూ. 25,86,920 కోట్లు ప్రపంచం మొత్తం జీడీపీలో 5.5శాతంతో సమానమనివివరించింది.