Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నదనీ, వైరస్ తీవ్రతపై అప్రమత్తంగా ఉండకపోతే సమీప భవిష్యత్లో మరణమృదంగం మోగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్-19 ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అధికమవుతోంది. అన్లాక్ ప్రక్రియతో చాలా దేశాల్లో గతంలో ఉన్నంత సీరియస్ ఇప్పుడు కన్పించడం లేదు. బహుశా ఈ కారణంగానే కరోనా వైరస్ సంక్రమణ పెరుగుతోంది. కొన్ని దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్వో ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది. అన్నిదేశాలు కలిసి సమిష్టిగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరణాల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని తెలిపింది. అదేవిధంగా కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్ అవసరంపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. సత్వర చర్యలు లేకపోయినా, వ్యాక్సిన్ రాకపోయినా మరణాల తీవ్రత పెరుగుతుందని అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య పది లక్షలకు చేరువలో ఉంది. ప్రస్తుత సమయంలో అప్రమత్తం కాకుంటే.. మరణాల సంఖ్య 20 లక్షలకు చేరుతుందని హెచ్చరించింది. 'కరోనా మరణాలు పది లక్షలు అనేది భయంకరమైన సంఖ్య. ఇప్పుడు 20 లక్షలు అనే సంఖ్యను నివారించడానికి కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామా? కలిసిపనిచేయకపోతే..ఆ సంఖ్యను కూడా చూస్తాం.' అని డబ్ల్యూహెచ్వో ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైకల్ ర్యాన్ మీడియాకు వెల్లడించారు. వైరస్ కారణంగా ఎదురయ్యే ప్రమాదం ఊహించడమే కష్టంగా ఉందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 3.28 కోట్ల కేసులు.. 10 లక్షల మరణాలు
'వరల్డోమీటర్' కరోనా తాజా గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 3,28,06,195 మంది కరోనా బారినపడ్డారు. అలాగే, దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా అమెరికాలో 72,45,723 మందికి కరోనా వచ్చింది. 2,08,483 మంది మరణించారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న బ్రెజిల్లో 59,08,748 పాజిటివ్ కేసులు, 1,40,709 మరణాలు చోటుచేసుకున్నాయి. 11,43,571 కేసులతో రష్యా నాల్గో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో ఉన్న కొలంబియాలో 7,98,317 కేసులు, 25 వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఆ తర్వాత స్థానంలోని పెరూ, స్పెయిన్, మెక్సికో, అర్జెంటినా, సౌత్ ఆఫ్రికా దేశాల్లోనూ కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.