Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఓసి అధ్యక్షుని వ్యాఖ్యలు
టోక్యో : కరోనా వైరస్కు వ్యాక్సిన్ లేకుండానే టోక్యో ఒలింపిక్ క్రీడలు నిర్వహించగలమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) అధ్యక్షుడు థామస్ బాక్ వ్యాఖ్యానించారు. లాసానెలోని ఐఓసి ప్రధాన కార్యాలయంలో టోక్యో 2020 నిర్వాహకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ బాక్ పై వ్యాఖ్యలు చేశారు. ''నెమ్మదిగానైనా కచ్చితంగా క్రీడలు జరగడాన్ని మనం చూడగలుగుతున్నాం.'' అని ఆయన పేర్కొన్నారు. వారాంతంలో జపనీస్ లీగ్లతో సహా ఇటీవలనే పెద్ద పెద్ద క్రీడా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారని అన్నారు. వీటన్నింటిని చూస్తే వ్యాక్సిన్ లేకుండానే మనం క్రీడా కార్యక్రమాలను నిర్వహించుకోగలమని రుజువైందని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య నిపుణులతో చర్చలు జరిపిన మీదట 2021 మొదటి అర్ధభాగంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం వుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభం నాటికే గణనీయమైన స్థాయిలో వ్యాక్సిన్ డోసులు వస్తాయని నిపుణులందరూ ఏకాభిప్రాయంతో అంగీకరించారంటూ ప్రోత్సాహకరమైన వార్తలు వస్తున్నాయన్నారు. వచ్చే 10మాసాల్లో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని అందువల్ల క్రీడా ప్రపంచం సమగ్రంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని బాక్ పునరుద్ఘాటించారు. ఒలింపిక్స్ ప్రారంభమయ్యేవరకు ఈ కృషి కొనసాగుతుందన్నారు. ఒలింపిక్స్ క్రీడల నిర్వహణను విజయవంతంగా నిర్వహించగలమని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.