Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అణు దేశాలకు ఐరాస చీఫ్ పిలుపు
ఐక్యరాజ్య సమితి : అణు యుద్దాన్ని గెలవలేమని, అందుకే వీటితో పోరాడరాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చెప్పారు. అణ్వాయుధాలను ఉపయోగిస్తే దాని ప్రభావం అన్ని దేశాలపైన పడుతుంది. కాబట్టే సామూహిక వినాశనానికి దారి తీసే ఈ దారుణ మారణాయుధాలను ఎవరూ ఎన్నడూ ఉపయోగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నిటిపైనా వుందని ఆయన చెప్పారు. జాతీయ ఆయుధాగారాల నుండి వీటిని పూర్తిగా తొలగించాలని ఆయన కోరారు. అంతర్జాతీయ అణ్వాయుధ నిర్మూలనా దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో గుటెరస్ మాట్లాడుతూ, ''విశ్వాస పునరుద్ధరణకు నిజమైన, సుహృద్భావంతో కూడిన చర్చల క్రమాన్ని పునరుద్ధరించాలన్నారు. అణు ముప్పును తొలగించేందుకు, అణునిరాయుధీకరణకు నిర్దిష్టంగా తగు చర్యలు చేపట్టాలని అణ్వాయుధ దేశాలను ఆయన కోరారు. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అణు నిరాయుధీకరణపై 2013 సెప్టెంబరు 26న జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఉన్నత స్థాయి సమావేశానికి కొనసాగింపు చర్యగా అదే ఏడాది డిసెంబరులో అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ మేరకు జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ అణు నిరాయుధీకరణే తమ ప్రాధాన్యత అంటూ అంతర్జాతీయ సమాజం ఇచ్చిన హామీని ఈ రోజున పునరుద్ఘాటించుకుంటారు.