Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాంటెవీడియో, హవానా : పరోపకారం, మానవ తావాదం, అంతర్జాతీయ సంఘీభావం వంటి లక్ష ణాల కారణంగా క్యూబాకి చెందిన వైద్య బృందం హెన్రీ రీవెకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రావాలని తాము ఆశిస్తున్నట్లు ఉరుగ్వే చాప్టర్ ఆఫ్ ది నెట్వర్క్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ హ్యుమానిటీ(ఆర్ఇడిహెచ్) శనివారం పేర్కొంది. ఆరోగ్య కార్యకర్తలతో కూడిన ఈ వైద్య బృందం గత 15ఏళ్ళుగా సాగించిన అద్భుతమైన కృషి, త్యాగాలు, నిబద్ధత, వృత్తి పట్ల అంకిత భావం, మానవాళి ప్రయోజనాల కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడం వంటి కారణాల రీత్యా ఆ సంస్థకు మద్దతివ్వాలని భావిస్తున్నట్లు ఆర్ఇడిహెచ్ ఒక ప్రకటనలో పేర్కొంది. క్యూబాపై అమెరికా ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను కఠినతరం చేసినా క్యూబా ప్రజలు మొక్కవోని విశ్వాసంతో ధైర్యంగా నిలబడి వైద్య రంగంలో సత్ఫలితాలు సాధించారని ఆ ప్రకటన ప్రశంసించింది. కరోనాపై పోరాడి, సామ్రాజ్యవాద దురహంకారాన్ని మరింత సంఘీభావంతో ఎదుర్కొన్నారని, డజన్ల సంఖ్యలో దేశాలకు వాస్తవికమైన, సమర్ధవంతమైన మానవతా సాయాన్ని అందించారని పేర్కొంది. ఆర్ఇడిహెచ్ సమావేశానికి హాజరైన మేథావులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలందరూ కూడా క్యూబాపై ఆంక్షలను ఖండించారు. అమెరికా చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు. హెన్రీ రీవె వైద్య బృందానికి నోబెల్ శాంతి బహు మతి రావాలని ఆకాంక్షించారు. ఆ అభ్యర్ధిత్వాన్ని బలపరిచారు.
బాంబులు కాదు, డాక్టర్లు!
నోబెల్ శాంతి బహుమతికి క్యూబా వైద్య బృందం అభ్యర్ధిత్వానికి పెరుగుతున్న తోడ్పాటును క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కేనల్ గుర్తించారు. ఈ సందర్భంగా శనివారం ట్విట్టర్లో క్యూబా విప్లవ నేత కాస్ట్రో మాటలను ఉటంకించారు. 'ఒక దేశ అంతర్జాతీయ వైఖరిని నిర్వచించేది డాక్టర్లు, బాంబులు కాదు.'' అని ఆనాడు కాస్ట్రో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ప్రపంచ శాంతి మండలి లాంఛనంగా అభ్యర్ధిత్వాన్ని నమోదు చేసింది. కరోనా నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్ళను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఇటువంటి అత్యవసర సమయంలో అంతర్జాతీయ సంఘీభావం అవసరమని వ్యాఖ్యానించింది. దాదాపు వంద దేశాల్లోని జాతీయ శాంతి కమిటీలు తమ సంతకాలతో కూడిన లేఖను నోబెల్ కమిటీకి పంపాయి. క్యూబా ఇప్పటివరకు 46 వైద్య బృందాలను 39దేశాలకు పంపిందని, 3700మంది ఆరోగ్య కార్యకర్తలు పనిచేశారని అధికార గణాంకాలు తెలుపుతున్నాయి.