Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : భారత్, చైనా సరిహద్దు సమీపంలో చైనా పెద్ద ఎత్తున బలగాలను మోహరించిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. ఈ నేపథ్యంలో చైనాపై పోరు సల్పేందుకు భారత్కు భాగస్వామి అవసరమని ఆయన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికా ఈ పోరులో భారత్కు సహకరించడానికి సిద్ధంగా వుందన్నారు. చైనా చర్యలు క్వాడ్ దేశాలకు ఇబ్బందికరంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. చైనా నుండి మన ప్రజలను, భాగస్వాములను కాపాడుకోవాల్సిన అవసరం వుందని గత వారం టోక్యోలో జరిగిన క్వాడ్ సమావేశంలో పాంపియో పేర్కొన్నారు. మరో ఇంటర్వ్యూలో కూడా పాంపియో ఇదే రీతిలో వ్యాఖ్యలు చేశారు.
భారత్ ఉత్తర సరిహద్దుల్లో దాదాపు 60వేలమంది చైనా సైనికులు మోహరించి వున్నారని శుక్రవారం గై బెన్సన్ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రేడియో హౌస్ట్ లారీ ఓ కార్నర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, క్వాడ్ గ్రూపులోని ప్రతి ఒక్క దేశానికి చైనా వల్ల కలిగే ముప్పులను ప్రతిఘటించగల విధానాలను, అవగాహనను భాగస్వామ్య దేశాలు అభివృద్ధి పరుచుకుంటున్నాయని అన్నారు. చైనాను వెనక్కి నెట్టేందుకు సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంపియో చెప్పారు. చైనా ముప్పు నుండి అమెరికన్లను కాపాడుకోవడమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమని చెప్పుకున్నారు. కాగా, క్వాడ్ కూటమి చేస్తున్న వాదనలను, ఆరోపణలను చైనా కొట్టివేసింది.