Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెల్ అవీవ్ : ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయిల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా నెతన్యాహు పాలనను వ్యతిరేకిస్తూ శనివారం రాత్రి వేలాది మంది నిరసనకారులు టెల్ అవీవ్ నగరంలోని వీధుల్లోకి వచ్చారు. కరోనా వ్యాప్తి నియంత్రణ పేరుతో ఇంటి నుంచి ఒక కిలోమీటర్ దూరం దాటి బయటకు వచ్చి నిరసనలు తెలపకూడదని ప్రభుత్వం ఇలీవల జారీ చేసిన ఆదేశాలను నిరసనకారులు ధిక్కరించారు. సెంట్రల్ టెల్ అవీవ్లోని హబీమా స్వ్కేర్ వద్దకు వచ్చిన వేలాది మంది నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించింది. ఈ సందర్భంగా 'మా భవిష్యత్తును నాశనం చేస్తున్న బీబీ దిగిపో' అన్న నినాదాలు మిన్నంటాయి. భారీగా వచ్చిన నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. నిరసనకారులను నేలపై ఈడ్చుకెళ్లడం, పోలీస్ వాహనాల్లోకి బలవంతంగా నెట్టిపడేయడం వంటి అమానుష చర్యలకు పాల్పడ్డారు. జెరూసలెంలోని ప్రధాని అధికారిక నివాసంతో పాటు ఇతర నగరాల్లో బ్లాక్ ఫ్లాగ్ మూవ్మెంట్ ర్యాలీలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ర్యాలీల్లో 2 లక్షల మందికి పైగా పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఎమర్జెన్సీ తరహా నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ ప్రజలు వాటిని ఖాతరు చేయకుండా పెద్దయెత్తున నిరసనల్లో వచ్చి పాల్గొనడం విశేషం.