Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా 3.75 కోట్ల కేసులు, 10.78 లక్షల మరణాలు
- టాప్-5లో అమెరికా, భారత్, బ్రెజిల్, రష్యా, కొలంబియా
- ఆ దేశంలో ఒక్కకేసు నమోదుకాలేదు !
వాషింగ్టన్: అమెరికాలో వచ్చే ఏడాది జనవరి నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభమవుతుందని యూఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్టుమెంట్ సెక్రెటరీ రాబర్ట్ కాడెక్ వెల్లడించారు. పంపిణీకి సంబంధించిన అనుమతులు ఈ ఏడాది చివరికల్లా వచ్చే అవకాశముందన్నారు. దీనికి అనుగుణంగా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంత చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే, ఈ ఏడాదిలోపే వ్యాక్సిన్ తీసుకురావడానికి ట్రంప్ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నదని అన్నారు. కాగా, రాబోయే శీతాకాలంలో కరోనా విజృంభణ కొనసాగే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పెరుగుతున్న కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతూనే ఉంది. పలు దేశాల్లో ఆందోళనకరంగా కేసులు, మరణాలు వెలుగు చూస్తున్నాయి.
నిత్యం 3.5 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లోనే మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకూ 3,75,41,490 మంది కరోనా బారినపడ్డారు. అలాగే, 10,78,602 మంది వైరస్తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 2,81,67,117 మంది కోలుకున్నారు.
ఈ దేశాల్లోనే అధికం
'వరల్డో మీటర్' కోవిడ్-19 తాజా సమాచారం ప్రకారం.. ప్రపంచంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, రష్యా, కొలంబియాలు టాప్-5లో ఉన్నాయి. అత్యధికంగా అమెరికాలో 79,49,351 మంది కరోనా బారినపడ్డారు. అలాగే, 2,19,300 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల్లో భారత్ రెండో స్థానంలో ఉండగా, మరణాల్లో మూడో స్థానంలో కొనసాగుతున్నది. కేసుల్లో మూడో స్థానంలో ఉన్న బ్రెజిల్ మరణాల్లో మాత్రం రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకూ అక్కడ 50,91,840 పాజిటివ్ కేసులు, 1,50,236 మరణాలు నమోదయ్యాయి. 12,98,718 పాజిటివ్ కేసులు, 22,559 మరణాలో రష్యా నాల్గో స్థానంలో ఉండగా, ఐదో స్థానంలో ఉన్న కొలంబియాలో 9,02,747 కరోనా కేసులు, 27,660 మరణాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో స్పెయిన్, అర్జెంటినా, పెరూ, మెక్సికో, ఫ్రాన్స్ దేశాలున్నారు.
ఒక్కరికి కూడా సోకలేదు
ప్రపంచ దేశాలన్నీ కరోనా సృష్టించిన సంక్షోభం కారణంగా తీవ్ర ఇబ్బందుల పడుతున్నాయి. వైరస్ వ్యాప్తి కారణంగా దాదాపు అన్ని దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ.. తమ దేశంలో తీసుకున్న చర్యల కారణంగా అలాంటి ప్రభావమేమి లేకుండా చూసుకున్నామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ఆ దేశ అధికార పార్టీ 'వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా' స్థాపించి 75 ఏండ్లు అయిన సందర్బంగా మిలిటరీ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమలో పాల్గన్న కిమ్.. తమ దేశంలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని స్పష్ట చేశారు. కాగా, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకానికి నిలబెట్టుకునే స్థాయిలో పనిచేయలేనందుకు సిగ్గుగా ఉందనీ, దేశ ప్రజల కష్టాలను గట్టెంకించేందుకు తాను చేసిన పనులు సరిపోలేదంటూ వ్యాఖ్యనించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బ్రెజిల్లో లక్షన్నర కరోనా మరణాలు
రియోడి జెనిరోః బ్రెజిల్లో కరోనా మరణాల సంఖ్య లక్షన్నర మార్కును దాటింది. శనివారం రాత్రి సమయానికి దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,50,198గా ఉందని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. జాన్హాప్కిన్స యూనివర్సిటీ గణాంకాల ప్రకారం వైరస్ కారణ మరణాల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండోస్థానంలో ఉంది. బ్రెజిల్లో మితవాద అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో తొలి నుంచి వైరస్ ప్రభావాన్ని తక్కువ అంచనా వేస్తూ వస్తున్నారు. పలు సందర్భాల్లో ఆయన భౌతిక దూరం నిబంధనలను పాటించకుండా ఉండడంతో పాటు, అధ్యక్ష నివాసం నుంచి బయటకు వచ్చే సమయాల్లో అధిక సంఖ్యలో జనాలు వచ్చేలా ప్రోత్సహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు సంబంధించి గవర్నర్లు, మేయర్లు విధించే లాక్డౌన్లు, ఇతర కఠిన చర్యలను ఆయన తిరస్కరించారు. జులై నెలలో ఆయన కరోనా భారిన పడిన సమయంలో కూడా తన వైఖరిని మార్చుకోలేదు. ఆర్ధిక కార్యకలాపాలపై లాక్డౌన్ విధించడం వలన దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో పడుతుందని చెప్పుకొచ్చారు. అయితే గత కొంత కాలంలో దేశంలో కరోనా వ్యాప్తి గతంలో పోల్చుకుంటే కొంత తగ్గుముఖం పుతున్నట్లు కనిపిస్తోంది. అయినా కూడా 50 లక్షలు దాటిన కేసులో బ్రెజిల్ ప్రపంచంలోనే అమెరికా, భారత్ తర్వాత మూడో స్థానంలో ఉంది. కరోనా కేసులు తిరిగి పుంజుకునే ప్రమాదం ఉందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్నా సావ్ పౌలో, రియోడి జెనిరోల్లో మేయర్లు సినిమాలు, పాఠశాలలు వంటి కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నారు.