Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంస్కరణలపై విద్యార్థులు, యువత, కార్మికులు ఆగ్రహం
జకార్తా : ఇండోనేషియాలో కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా మొదలైన ప్రజా ఆందోళనలు రోజు రోజుకీ ఉధృతమవుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో చోటుచేసుకుంటన్న నిరసనల్లో విద్యార్థులు, యువత, ముస్లింలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. రాజధాని జకార్తాలో మంగళవారం జరిగిన ఆందోళనల్లో లక్షలాదిమంది పాల్గొన్నారు. పార్లమెంట్ ఆమోదించిన నూతన కార్మిక చట్టాల్ని వెంటనే రద్దు చేయాలనీ, వీటితో కార్మికుల జీవితాలు దెబ్బతింటాయని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేస్తూ రాజధాని వీధుల్లో నిరసనగళమెత్తారు. నూతన కార్మికుల చట్టాలకు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదముద్ర వేయవద్దని దేశ అధ్యక్షుడ్ని కోరుతున్నారు. నల్లజెండాలు ఊపుతూ అధ్యక్షుడి ప్యాలెస్కు సమీపంలో నిరసనర్యాలీ సాగింది. జకార్తాలో గత నాలుగురోజులుగా నిరసనకారులు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఆదివారం ఇండోనేషియా పార్లమెంట్ 'ద జాబ్ క్రియేషన్ లా'ను ఆమోదించింది. గతంలోని 79చట్టాల్ని సవరించారు. కార్మికరంగంలో నిబంధనల్ని పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చారు. నెలవారీ జీతాలే ఇవ్వాలనే నిబంధనను మార్చారు. పనిచేసిన గంటలకు లెక్కగట్టి వేతనాన్ని ఇచ్చే సౌలభ్యాన్ని తీసుకొచ్చారు. ఔట్సోర్సింగ్కు మార్గం సుగమం చేశారు. ఇవన్నీ కూడా దేశంలోని కార్మికులు, విద్యార్థులు, యువతలో ఆగ్రహాన్ని పెంచింది.