Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతీయ అమెరికన్ల షాక్!
- బైడెన్ వైపే వారి మొగ్గు అంటున్న తాజా సర్వే
- మోడీ దోస్తీ కూడా పనిచేయదన్న భావనలో అమెరికా అధ్యక్షుడు
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్నకు ముచ్చెమటలు పడుతున్నాయి. పైకి గంభీరంగా ప్రచారం చేస్తున్నా...మోడీ దోస్తీ కూడా పనిచేయదన్న భావనలో ఆయన ఉన్నట్టు స్పష్టమవుతున్నది. ఎందుకంటే..ఇటీవల జరిగిన చర్చలోనూ బిడెన్కు అనుకూలంగా ఫలితమొచ్చింది. తాజాగా 26 లక్షలకు పైగా ఉన్న భారతీయ అమెరికన్ ఓటర్లు కూడా రెండోసారి ట్రంప్కు ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలనుకుంటున్నట్టు తెలుస్తున్నది. 12 రాష్ట్రాల్లో వీరి మొగ్గును బట్టి ఎన్నికల ఫలితాలు అతి స్వల్ప మెజారిటీతో మారిపోయే ఛాన్స్ ఉన్నది.ఈ ఫలితాలు కాబోయే అధ్యక్షుడు ఎవరనేదీ నిర్ణయించడంలో కీలకమవుతాయని పరిశీలకుల అంచనా. హాట్హాట్గా ఎన్నికల ప్రచారాలు కొనసాగుతున్న వేళ.. భారతీయ అమెరికన్లపై జాన్ హాప్కిన్స్ విశ్వ విద్యాలయంతో సహా పలు సంస్థలు ఓ సంయుక్త సర్వేను చేపట్టాయి. 'ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే' (ఐఏఏఎస్) పేరిట నిర్వహించిన ఈ సర్వేలో భారతీయ అమెరికన్ ఓటర్ల నాడికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచి 20 మధ్య ఈ సర్వే నిర్వహించారు.
అంచనాలకు విరుద్ధంగా..
ఈ సారి అధ్యక్షఎన్నికలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్కే జైకొడతామని 72 శాతం భారతీయ అమెరికన్లు చెబుతున్నారు. ఇక రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్కు మద్దతిచ్చే భారతీయుల శాతం 22 శాతంగానే కొనసాగుతుండటం గమనార్హం.
ప్రధాని మోడీతో అధ్యక్షుడు ట్రంప్ సత్సంబంధాలు, మోడీతో హ్యూస్టన్, అహ్మదాబాద్ సభల్లో ఒకే వేదికను పంచుకోవడం.. కాశ్మీరు, సీఏఏ వ్యవహారాల్లో ఆయన తటస్థంగా ఉండడం వంటివి ఓటర్లను ఆకర్షిస్తాయని రిపబ్లికన్లు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. అయితే, వారి అంచనాలకు విరుద్ధంగా భారత్, అమెరికా సంబంధాలకు వీరు అంతగా ప్రాధాన్యమివ్వకపోవడం గమనార్హం. కాశ్మీర్, సీఏఏ అంశాల్లో ట్రంప్ మౌనం వహించగా.. బైడెన్ భారత్పై విమర్శలు గుప్పించారు.
అయినా ఇక్కడి భారతీయుల మద్దతు బైడెన్కే ఉండటం గమనార్హం. వీరి ఓటు నిర్ణయాన్ని ప్రభావితం చేసే మొత్తం 12 అంశాల్లో భారత్- అమెరికా సంబంధాలకు 11వ స్థానం దక్కడమే ఇందుకు కారణమని తెలిసింది.
భారతీయ అమెరికన్లను ప్రభావితం చేసే అంశాల్లో ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, వర్ణభేదాలు, పన్నులు, అవినీతి, వలస విధానం, పర్యావరణం, ఆర్థిక అసమానతలు, తీవ్రవాదం, విద్య వంటివి ఉన్నాయి. వీటిలో ఎక్కువ అంశాల్లో ట్రంప్కు వ్యతిరేకంగానే ఉండటంతో భారతీయుల విషయంలో ఆయనకు ఎదురుగాలి వీయడం ఖాయం అని నిపుణులు అంటున్నారు.
అధిక శాతం భారతీయులు డెమోక్రాట్లకు ఓటేసేలా కమలా హారిస్ను ఉపాధ్యక్ష అభ్యర్థిత్వం దోహదపడుతుందని సర్వే అభిప్రాయపడింది. మరి ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యే అవకాశాలపై అమెరికాలోనే కాదు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.