Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : డెమొక్రాటిక్ పార్టీకి చెందిన మిచిగన్ గవర్నర్ విట్మెర్ను 'నియంత' అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆమెను కిడ్నాప్ చేసి, హతమార్చడానికి ఫాసిస్ట్ ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్రను ఆయన బాహాటంగా సమర్ధించారు. ''మిచిగన్లో నియంతలా వుండాలని ఆమె భావించారు. కానీ ప్రజలు ఆమెకు బాసటగా నిలబడలేదు.'' అని ఆయన ఫాక్స్ వార్తా సంస్థతో అన్నారు. ఆమెపై జరిగిన కుట్రను ఇలా సమర్ధించడాన్ని బట్టి చూస్తుంటే నవంబరు 3న జరిగే ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వుంటే వాటిని పట్టించు కోకుండా అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండేందుకు ట్రంప్ పథకం పన్నినట్టు తెలుస్తోంది. ఆయన పరోక్షంగా చేస్తున్న బెదిరింపులతో మితవాద అరాచక మూకలు మరింత రెచ్చిపోయే ప్రమాదముంది. గవర్నర్పై జరిగిన కుట్రకు సంబంధించి 14వ వ్యక్తిని అరెస్టు చేసినట్లు మిచిగన్ అటార్నీ జనరల్ దానా నెసెల్ ప్రకటించడంతో ట్రంప్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఆ వ్యక్తిని విస్కాన్సిన్కి చెందిన 51ఏళ్ళ బ్రియాన్ హిగ్గిన్స్గా గుర్తించారు. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా అరెస్టయిన పలువురిని విచారించగా కుట్రకు సంబంధించి కేవలం కొన్ని వివరాలు మాత్రమే వెల్లడయ్యాయని అటార్నీ జనరల్ తెలిపారు.
పలు రాష్ట్రాలకు చెందిన మిలీషియా గ్రూపులు ఈ కుట్రలో భాగస్వాములుగా వున్నాయని, ఇది కేవలం మిచిగన్ గవర్నర్ కిడ్నాప్నకు మాత్రమే పరిమితమైన కుట్ర కాదని, చాలా విస్తృతమైన అంశాలు ఇందులో దాగి వున్నాయని ఎఫ్బిఐ ప్రత్యేక ఏజెంట్ రిచర్డ్ ట్రాస్క్ తెలిపారు. కుట్రదారులు చిన్నసైజు సైన్యాన్ని సమీకరించుకున్నారని తెలుస్తోందన్నారు.