Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విరాళాలకై కోటీశ్వరులకు డబ్ల్యుఎఫ్పి చీఫ్ పిలుపు
ఐక్యరాజ్య సమితి : లక్షలాదిమంది ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాల్సిందిగా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్పి) చీఫ్ మరోసారి ప్రపంచ కోటీశ్వరులకు విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి తలెత్తినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా కరువు బారిన పడిన బాధితుల సంఖ్య 13.5కోట్ల నుండి 27కోట్లకు పెరిగిందని తెలిపారు. మానవాళికి సాయం చేయడానికి ముందుకు రావాల్సిన సమయం ఇదేనని డబ్ల్యుఎఫ్పి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన డేవిడ్ బేస్లేకోరారు. ఇదే సమయంలో, కరోనా సంక్షోభం ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ నాటికి 8లక్షల కోట్ల డాలర్లుగా వున్న ప్రపంచవ్యాప్తంగా గల 2200మంది కోటీశ్వరుల సంపద జులై నాటికి 10.2లక్షల కోట్లకు పెరిగిందని గత వారం ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. ''ప్రపంచం సంక్షోభ దశలో వుంది. ఇటువంటి సమయంలోనే గతంలో ఎన్నడూ లేనిన రీతిలో కోటీశ్వరులు ముందుకు వచ్చి సాయం చేయాలని'' కోరారు. ఇది తమ అభ్యర్ధన అని పేర్కొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతటి పెను విపత్తును ఎదుర్కొనడానికి, లక్షలాదిమంది ప్రజలను కాపాడేందుకు ఈ సాయం అవసరమని ఆయన ఆన్లైన్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. ఎవరెవరు సాయం చేయాలని మీరనుకుంటున్నారో పేర్లు వెల్లడించాలని జర్నలిస్టులు కోరగా వారి పేర్లను తాను చెప్పాలనుకోవడం లేదని, బాధితుల పక్షాన నిలబడి అడుగుతున్నానని చెప్పారు. 2021 సంవత్సరం పట్ల డబ్ల్యుఎఫ్పి చాలా ఆందోళన చెందుతోందని, ఆర్థిక వ్యవస్థలపై పడిన కరోనా ప్రభావాన్ని ఏ దేశమూ ముందుగా గమనంలోకి తీసుకునే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. సంపన్న దేశాలు ఇప్పటికే కరోనాను ఎదుర్కొనేందుకు ఆర్థిక ఉత్తేజ ప్యాకేజీల కింద 17లక్షల కోట్ల డాలర్లను ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించాయన్నారు. అయితే ఈ మొత్తాలు ఈ సంవత్సరానికి అందుబాటులో వుండడం లేదన్నారు. ఈ ఏడాది పలు దేశాలు సంక్షోభంలోకి కూరుకుపోయాయని అన్నారు. ఇది చాలా దయనీయమైన పరిస్థితని వ్యాఖ్యానించారు. ఇటువంటి సమయంలో పెద్ద మొత్తంలో ఒకేసారి ద్రవ్యం అవసరమవుతుందని అన్నారు.