Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : రష్యా కొవిడ్ వ్యాక్సిన్కు సంబంధించి భారత్లో చివరి దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు రష్యన్ ప్రత్యక్ష పెట్టుబడుల నిధి (ఆర్డిఐఎఫ్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ లిమిటెడ్లకు ఆమోదం లభించినట్లు సావరిన్ వెల్త్ ఫండ్ శనివారం తెలిపింది. భారతదేశంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్కి సంబంధించి పెద్ద ఎత్తున ట్రయల్స్ చేపట్టినట్లు తొలుత ప్రకటించారు. ఆ తర్వాత భారత రెగ్యులేటర్లు దానికి మద్దతు ఇచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో రష్యాలో ఫేజ్ 1, 2ల్లో నిర్వహించిన ట్రయల్స్ చాలా చిన్నవని వారు పేర్కొంటూ వాటిని పునరావృతం చేయాల్సిందిగా కోరారు. కొత్తగా కుదిరిన ఒప్పందం ప్రకారం, భారత్ ప్రస్తుతం 1500మంది పాల్గొనే 2, 3 దశల్లోని మానవ క్లినికల్ ట్రయల్స్ను నిర్వహిస్తుందని ఆర్డిఐఎఫ్ పేర్కొంది. విదేశాల్లో ఈ వ్యాక్సిన్ను ఆర్డిఐఎఫ్ మార్కెటింగ్ చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుంది, భారత్లో ఆ వ్యాక్సిన్ను పంపిణీ చేసే బాధ్యత కూడా చేపడుతుంది. రెడ్డీస్ ల్యాబ్కు ఆర్డిఐఎఫ్ 10కోట్ల డోసులను సరఫరా చేస్తుంది. కరోనా వైరస్ వ్యాక్సిన్కు నియంత్రణలతో కూడిన ఆమోదం పొందిన మొదటి దేశమైన రష్యా బెలారస్, వెనిజులా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల్లో స్పుత్నిక్ వి ఫేజ్ 3 ట్రయల్స్ను నిర్వహిస్తుంది. 30కోట్ల డోసులు సరఫరా చేసేందుకు భారత తయారీదారులతో ఆర్డిఐఎఫ్ ఒప్పందాలు కుదుర్చుకుంది.