Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో శనివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. కోవిడ్-19 నియంత్రణలో జెసిండా ప్రభుత్వం తీసుకున్న మెరుగైన చర్యలు, శాంతి స్థాపనకు తీసుకున్న నిర్ణయాలే ఆమెకు అపూర్వ విజయాన్ని కట్టబెట్టాయి. దీంతో రెండో సారి ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 83.7 శాతం ఓట్లు పోలవగా.. అందులో జెసిండా నేతృత్వంలోని లేబర్ పార్టీ 50.5 శాతం, దాని మిత్ర పక్షమైన గ్రీన్ పార్టీ 7.6 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. అలాగే, న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీకి 2.3 శాతం ఓట్లు పడ్డాయి. ప్రతిపక్ష నేషనల్ పార్టీ 25.8 శాతం ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. 50.5 శాతం శాతం ఓట్లు పొందిన లేబర్ పార్టీకి 120 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్లో సగం సీట్లు ఖాయమైనట్టుగా తెలుస్తున్నది. కాగా, సగానికిపైగా సీట్లు గెెలిచి.. తొలి సారిగా సింగిల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి లేబర్
పార్టీ చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రధాని జెసిండా ఆర్డెన్.. భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా తీర్పు పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. రాబోయే మూడు సంవత్సరాలలో చేయాల్సిన పని చాలా ఉందని వెల్లడించారు. కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటకు తీసుకురావడానికి మరింత మెరుగైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను ఆమె 'ది కోవిడ్ ఎలక్షన్స్'గా అభివర్ణించారు. కాగా, ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే.. తాము ఓటమి పాలయ్యామని ప్రతిపక్ష నేత జుడిత్ కోలిన్స్ అంగీకరించారు. అలాగే, ప్రధాని జెసిండాకు అభినందనలు తెలిపారు. కాగా, జుడిత్ నేతృత్వంలోని నేషనల్ పార్టీకి 30 సీట్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.