Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యరాజ్యసమితి ఆందోళన
బ్రస్సెల్స్ : కరోనా మహమ్మారి కారణంగా లింగ సమానత్వం దిశగా సాగాల్సిన పురోగతి మందగించిందని ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యానించింది. ఇప్పటికే నత్తనడకన సాగుతున్న ఈ పరిస్థితిని కరోనా మరింత దెబ్బతీసిందని పేర్కొంది. మహిళల పట్ల హింస, పని ప్రదేశాల్లో అలాగే రాజకీయ నేతృత్వాలకు సంబంధించిన అసమానతలు దాదాపు 25 ఏండ్ల కిందట ఎలా వున్నాయో అంతే అధ్వాన్నంగా వున్నాయని ''ది వరల్డ్స్ వుమెన్ 2020'' పేరుతో వెలువరించిన నివేదికలో ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 1995లో బీజింగ్లో మహిళల హక్కులపై జరిగిన సమావేశంలో ఐక్యరాజ్య సమితిలోని 189 సభ్య దేశాలు నిబద్ధత ప్రకటించిన నాటి నుంచి ఇప్పటివరకు విద్యా రంగంలో స్వల్ప ప్రయోజనాలే సాధించామనీ, ప్రసూతి మరణాల సంఖ్య కొద్దిగా తగ్గిందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ చెప్పారు. మహిళలకు సమాన అధికారాలు, సమాన హక్కుల దిశగా పురోగతి కేవలం భ్రమగానే మిగిలిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఏ దేశమూ కూడా లింగ సమానతను సాధించలేదు. ఇప్పటికి సాధించిన పరిమిత ప్రయోజనాలను కూడా కోవిడ్ సంక్షోభం తుడిచిపెట్టేసిందని ప్రపంచ మహిళా నివేదిక పేర్కొంది. 2030కల్లా లింగ సమానత్వాన్ని సాధించాలన్నది ప్రపంచ దేశాల లక్ష్యాల్లో ఒకటిగా వుంది. దారిద్య్రం, ఘర్షణలు వంటి సామాజిక రుగ్మతలను ఎదుర్కొనడానికి 2015లో బీజింగ్ సమావేవంలో ఆమోదించిన లక్ష్యాల్లో ఇదొకటి. ప్రాధమిక, సెకండరీ స్కూళ్ళకు బాలురు, బాలికలు సమానంగానే వెళుతున్నారనీ, ఉన్నత విద్యకు వచ్చేసరికి పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా కాలేజీల్లో చేరుతున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. కానీ, లేబర్ మార్కెట్కు వచ్చేసరికి మూడు వంతుల మంది పురుషులతో పోలిస్తే సగానికి కన్నా తక్కువమంది మహిళలకే చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపింది. 1995 నుంచి ఈ అంతరం ఇలాగే కొనసాగుతోందని పేర్కొంది. ''బాలికలు పాఠశాల విద్య పూర్తి చేస్తున్నారు. యూనివర్సిటీల్లో కూడా చేరుతున్నారు.'' అని చాలామంది భావిస్తున్నారు. కానీ జరగాల్సినంత జరగడం లేదని స్పష్టమవుతోందని మహిళలు, శాంతి, భద్రతలకు సంబంధించి జార్జిటౌన్ యూనివర్సిటీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జెనీ క్లుగ్మన్ వ్యాఖ్యానించారు. దక్షిణాసియా, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాల్లో కార్మికుల్లో మహిళల ప్రాతినిధ్యం 30శాతం కన్నా తక్కువగానే వుందని ఐరాస పేర్కొంది. రాజకీయ నేతృత్వానికి సంబంధించి చూసినట్లైతే లింగ సమానత కూడా ఇక్కడ కూడా తక్కువగానే వుందని పేర్కొంది. 1995లో కన్నా ఇప్పటికి మరో 8మంది మహిళా అధినేతలు వున్నారని తెలిపింది. ఇక ఉన్నత స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం 1995లో వున్నట్లే దాదాపుగా వుందని పేర్కొంది.