Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుది విడత చర్చలోనూ వైఖరి మార్చని ట్రంప్
వాషింగ్టన్ : నవంబరు 3న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తుది విడతగా గురువారం రాత్రి నాషవిల్లెలో అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్ధి జో బిడెన్లు చర్చలో పాల్గొన్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్గా వున్న కరోనా వైరస్కు సంబంధించిన ప్రశ్నే మొదటగా మోడరేటర్ క్రిస్టిన్ వాకర్ అడిగారు. దానిపై ట్రంప్ స్పందిస్తూ, ఇప్పుడు తాను దాన్ని విజయవంతంగా ప్రతిఘటించగలిగానని వ్యాఖ్యానించారు. తనకు దాన్నుండి వ్యాధి నిరోధకత (ఇమ్యూన్) వుందని అన్నారు. కరోనా తాకిడి నేపథ్యంలో కొందరు వేసిన అంచనాల కన్నా తక్కువగానే మన దేశంలో మరణాలు నమోదయ్యాయని ట్రంప్ చెప్పుకున్నారు. దీనిపై బిడెన్ వెంటనే స్పందించారు. ట్రంప్ ప్రతీసారీ ఈ మహమ్మారిని తక్కువ చేసి చూపిస్తూనే వచ్చారని అన్నారు. త్వరలోనే దాన్ని పారద్రోలుతామని కూడా వాగ్దానం చేశారని అన్నారు. కానీ ఆయన అసమర్ధత వల్ల మొత్తంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయని బిడెన్ విమర్శించారు. ఎన్నికల భద్రత గురించి ప్రశ్నించగా, ట్రంప్ కొట్టిపారేశారు. రష్యా నుండి లక్షలాది డాలర్లను బిడెన్ స్వీకరించారని ఆరోపించారు. ఆ ఆరోపణలను బిడెన్ తిరస్కరించారు. తాను కట్టిన పన్నుల వివరాలను ట్రంప్ వెల్లడించాలంటూ బిడెన్ మరోసారి కోరారు. వాటిని బహిరంగపరుస్తానంటూ ట్రంప్ గత నాలుగేండ్లుగా పదే పదే చెబుతున్నప్పటికీ ఇంతవరకు వెల్లడించలేదని అన్నారు. ఆరోగ్య సంరక్షణ గురించి ప్రశ్నించగా, ఒబామాకేర్ను రద్దు చేయాలన్నది తన లక్ష్యమని ట్రంప్ చెప్పారు. దీని స్థానంలో సరికొత్తగా మంచి ప్రణాళికను తీసుకువస్తామని ప్రకటించారు. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. బ్లాక్ లైవ్స్ మేటర్ గురించి మోడరేటర్ ప్రశ్నించగా, ఇక్కడ వున్నవారిలో అత్యంత తక్కువగా వర్ణ వివక్ష భావాలు కలిగిన వ్యక్తిని తానేనని ట్రంప్ చెప్పుకున్నారు. దీన్ని బిడెన్ వెంటనే ఎద్దేవా చేశారు. ఆధునిక చరిత్రలో మనకు వున్న వర్ణ వివక్ష కలిగిన అధ్యక్షుల్లో ట్రంప్ ఒకరని బిడెన్ పేర్కొన్నారు.
పెరగనున్న మెయిల్ బ్యాలెట్లు
ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో 4.75కోట్లకు పైగా ఓట్లు నమోదయ్యాయని అమెరికా ఎన్నికల ప్రాజెక్టు డేటా పేర్కొంది. 2016లో వేసిన దానికన్నా దాదాపు 8రెట్లు ఎక్కువగా ఎర్లీ ఓట్స్ పోలయ్యాయి. ఈసారి కరోనా కారణంగా భద్రతా ఆందోళనలతో మరింతమంది మెయిల్ బ్యాలెట్లనే ఉపయోగించుకుంటారని భావిస్తున్నట్లు తెలిపింది. అమెరికా ఎన్నికల ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఫ్లోరిడా యూనివర్శిటీ ప్రొఫెసర్ మైఖేల్ మెక్డొనాల్డ్ మాట్లాడుతూ, ఈసారి 15కోట్ల మంది వరకు మెయిల్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వుందన్నారు. 1908 తర్వాత ఇదే రికార్డు స్థాయి కావచ్చు. అంటే మొత్తం అర్హత గల ఓటర్లలో వీరే 65శాతం వరకు వుండవచ్చునని భావిస్తున్నారు.
బారెట్ నామినేషన్పై సెనెట్ లో ఓటింగ్
సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా అమె కోని బారెట్ నామినేషన్పై పూర్తి స్థాయి సెనెట్ ఓటింగ్కు మొగ్గు చూపుతూ సెనెట్ జ్యుడీషియల్ కమిటీ గురువారం ఓటు వేసింది. బారెట్ నామినేషన్ను 12-0 ఓటుతో ముందుకు తీసుకెళ్ళింది. రిపబ్లికన్లు ఈ నామినేషన్పై ఓటింగ్కు మొగ్గు చూపగా, డెమోక్రాట్లు బహిష్కరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో రిపబ్లికన్లు ఈ చర్యకు పాల్పడుతున్నారంటూ బారెట్ నామినేషన్ను డెమోక్రాట్లు తిరస్కరిస్తున్నారు. వచ్చే వారం ప్రారంభంలో సెనెట్లో బారెట్ నామినేషన్పై ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు.
సీబీఎస్ ఇంటర్వ్యూ పట్ల ట్రంప్ అసంతృప్తి
ఈ వారంలో సీబీఎస్ చానల్లో లెస్లీ స్టాల్తో జరిగిన ఇంటర్వ్యూ పట్ల ట్రంప్ చాలా అసంతృప్తిగా వున్నారు. దాంతో గురువారం సిబిఎస్ దీన్ని ప్రసారం చేయడానికి ముందుగానే తన సంభాషణలకు సంబంధించి తన ఫుటేజీని ట్రంప్ విడుదల చేశారు. ''మీరు కఠినమైన ప్రశ్నలకు కూడా ఓకేనా? అని లెస్లీ ప్రశ్నించగా, ట్రంప్ లేదని సమాధానమిచ్చారు. సుప్రీం కోర్టు ఒబామా కేర్ను రద్దు చేస్తే ప్రస్తుతమున్న పరిస్థితులను మీరు ఎలా కాపాడగలుగుతారు? అని ప్రశ్నించగా, కాపాడగలుగుతానని ఆశిస్తున్నానని చెప్పారు. కానీ ఆరోగ్య సంరక్షణ ప్రణాళిక వివరాలు మాత్రం వెల్లడించడానికి ఇష్టపడలేదు. త్వరలోనే దాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఈలోగానే ట్రంప్ అర్ధంతరంగా ఇంటర్వ్యూను ముగించివేస్తూ ఇక చాలని అనుకుంటున్నానని చెప్పారు. అయితే ట్రంప్ ఈ సంభాషణల ఫుటేజీని ముందుగానే విడుదల చేయడం వల్ల సిబిఎస్తో వైట్హౌస్ చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లైంది. అయితే ఈ చర్య వల్ల తాము చేయాలనుకున్న పూర్తి, పారదర్శకమైన సందర్భానుసార రిపోర్టింగ్ను ఈ చర్య అడ్డుకోలేదని సీబీఎస్ న్యూస్ వ్యాఖ్యానించింది.